సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న మార్కెట్లు!

by  |
సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. సోమవారం నాటి మార్కెట్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ లాభాలను కొనసాగించాయి. జీడీపీ వృద్ధి అంచనాలతో పాటు, కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందనే సంకేతాలు మార్కెట్ సూచీలకు ఉత్సాహానిచ్చాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్లు భారీగా పుంజుకోవడంతో మార్కెట్లకు కలిసొచ్చాయి. వ్యాక్సిన్ సంబంధిత వార్తలతో ఇన్వెస్టర్లు దూకుడు పెంచారని, అందుకే సూచీలు రికార్డు స్థాయిలో ఎగసిపడ్డాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 347.42 పాయింట్లు ఎగసి 45,426 వద్ద ముగియగా, నిఫ్టీ 97.20 పాయింట్ల లాభంతో 13,355 వద్ద ముగిసింది. నిఫ్టీలో దాదాపు అన్ని రంగాలు బలపడగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా రంగాలు 1.5 శాతానికిపైగా దూసుకెళ్లాయి. రియల్టీ మాత్రమే స్వల్పంగా నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ షేర్లు అధిక లాభాలను దక్కించుకోగా, కోటక్ బ్యాంక్, నెస్లె ఇండియా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.90 వద్ద ఉంది.



Next Story

Most Viewed