మార్కెట్లకు 'మహా' ఎఫెక్ట్

by  |
మార్కెట్లకు మహా ఎఫెక్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూశాయి. ముఖ్యంగా దేశంలో కరోనా కేసుల భయం మార్కెట్లను ముంచెత్తింది. ఈ క్రమంలో మహరాష్ట్రలో మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ప్రైవేట్ కార్యాలయాలను మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మదుపర్లలో గతేడాది మార్చి నాటి సమయంలో లాక్‌డౌన్ విధించిన భయాలు కమ్ముకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

ఈ ప్రభావంతో మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడినట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 870.51 పాయింట్లు కోల్పోయి 49,159 వద్ద ముగియగా.. నిఫ్టీ 229.55 పాయింట్ల నష్టంతో 14,637 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఏకంగా 4 శాతం క్షీణించగా.. ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు డీలాపడ్డాయి. ఐటీ, మెటల్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే లాభాలను సాధించగా.. మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.34 వద్ద ఉంది.


Next Story

Most Viewed