ఈటల… ఏం తక్కువైందని విమర్శలు చేస్తున్నావ్ : శ్రీనివాస్ గౌడ్

by  |
Srinivas
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎల్పీ లీడర్, రెండు సార్లు మంత్రి పదవులు ఇచ్చిందని.. ఇవన్నీ చేసినందుకు విమర్శలా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏం తక్కువైందని విమర్శలు చేస్తున్నావని ప్రశ్నించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్ ను కాదని పార్టీ అధినేత కేసీఆర్ ఎల్పీ లీడర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం తర్వాత ఎక్కువ ప్రోటోకాల్ ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చారని, సొంత తమ్ముడులా చూసుకున్నారని… తప్పుడుగా ఆలోచించుకొని ఈటల బయటకు వెళ్లారన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా కేసీఆర్ పక్కన కూర్చునే స్థానం మరొకరికి ఇచ్చారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలోకి రాక ముందు వచ్చాక గుర్తింపు చూసుకోవాలని ఈటలకు సూచించారు. టీఆర్ఎస్ లో లేని ఆత్మగౌరవం.. బీజేపీలో ఏముందన్నారు. ఇక్కడ ఎలా ఉండే నీ స్థితి.. ఇప్పుడు అక్కడ ఎలా ఉందని… టీఆర్ఎస్ లో మీ గౌరవం.. బీజేపీలో మీ గౌరవం ఏంటన్నారు.

నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని, నాయకుడు ఏది చెప్తే అది చేసే మంచి వ్యక్తి అన్నారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్‌లో ఉండాలి.. కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలనుకునే వ్యక్తి హరీష్ రావు అని స్పష్టం చేశారు. మాట్లాడే భాష మార్చుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రం ఆదుకోనంతగా పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని, పౌల్ట్రీ పరిశ్రమపై అనేక ఊహాగానాలు వచ్చినప్పుడు ప్రజా క్షేత్రంలో మీకు మద్దతుగా చికెన్ తిన్న వ్యక్తి కేటీఆర్ అని పేర్కొన్నారు. నీ బాధలు, కష్టాలు టీఆర్ఎస్ పంచుకోలేదా.. కేటీఆర్, హరీష్ రావు ఆదుకోలేదా అని ప్రశ్నించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈటల బీజేపీలో చేరాడన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత గౌరవం ఎక్కడ, ఏ పార్టీలో ఉండదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఎంతో మంది నాయకులను తయారు చేశారని వెల్లడించారు.


Next Story