ఎమ్మెల్యే బొల్లం తీరుపై సీనియర్ల అసంతృప్తి

by  |
ఎమ్మెల్యే బొల్లం తీరుపై సీనియర్ల అసంతృప్తి
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ టీఆర్‌‌‌ఎస్‌‌లో వర్గపోరు తప్పేటట్లు లేదు. ఇప్పటికే ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తి ఉన్న నాయకులు సమీక్ష సమావేశాలలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మరోవైపు గతంలో పార్టీ ఇన్‌‌చార్జి‌గా ఉండి, టికెట్‌‌ దక్కించుకోలేక, రెండేండ్లు సబ్దుగా ఉన్న కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ఇటీవల కాలంలో నియోజకవర్గంలో తిరుగుతూ… పాత నాయకులను కలుస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో కొందరు ప్రజా ప్రతినిధులు, నాయకులు శశిధర్‌‌‌రెడ్డి వెంట వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుటుండడంతో టీఆర్‌‌‌ఎస్‌‌‌లో వర్గ పోరు తప్పేలా లేదు.

టికెట్ ఇవ్వకున్నా పార్టీలోనే..

గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు, రాష్ట్ర ముఖ ద్వారమైన కోదాడలో గులాబీ జెండా ఎగర వేసేందుకు సీటు కేటాయింపు విషయంలో సీఎం కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. నాడు టీఆర్ఎస్ టికెట్ కోసం శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చందర్‌‌ రావులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ టీఆర్ఎస్ పార్టీ వారి రువురిని కాదని టీడీపీలో ఉన్న బొల్లం మల్లయ్య యాదవ్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం బొల్లం మల్లయ్య యాదవ్‌ను గెలిపించుకుని రావాలని సీనియర్లు శశిధర్‌రెడ్డి, చందర్‌రావు, ఎర్నేని బాబులకు బాధ్యతలు అప్పగించింది. అందరి సమష్టి కృషితో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది.

ఎమ్మెల్యే తీరుతో అసంతృప్తి?

ఎమ్మెల్యేగా గెలుపొందిన బొల్లం మల్లయ్య మొదట ప్రతీ కార్యక్రమానికి అందరినీ కలుపుకుని వెళ్లారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే సీనియర్లను దూరం పెట్టడం ప్రారంభించారు. అనంతరం జరిగిన పలు ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే సీనియర్లను సంప్రదించకుండానే టికెట్లు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ పీఠం కోసం ప్రయత్నించిన ఎర్నేని బాబును కూడా ఎమ్మెల్యే పక్కన పెట్టారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై వారు గుర్రుగా ఉన్నారు.

పార్టీ మారుదామా?

ఎమ్మెల్యే బొల్లం తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని పాత టీఆర్ఎస్ నాయకులను, ఉద్యమకారులను కలుస్తూ పార్టీ మారేందుకు వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా శిశధర్ రెడ్డి టీఆర్ఎస్ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఆయనకు ఉన్న విద్యాసంస్థలను, ఆస్తులను కూడా అమ్ముకుని పార్టీ అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా తానే ముందుండి ఆదుకున్నాడు. 75 వేల పైగా సభ్యత్వాలు చేశారు. ఇంత చేసినా పార్టీలో గుర్తింపు లేకపోవడం, ఇచ్చిన హామీలు అధిష్ఠానం నిలబెట్టుకోకపోడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరుగుతున్న పలు శుభకార్యాలకు చందర్‌రావు, ఎర్నేని బాబులతో కలిసి పాల్గొంటున్నారు. ఇది గమనించిన ఎమ్మెల్యే ఇటీవలే నియోజకవర్గ స్థాయిలో మండలాల కార్యకర్తల నాయకులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న విషయాల గురించి ఆరా తీశారు. కాగా ఆ ముగ్గురుతో పాటు మరో ఇద్దరు సీనియర్ నాయకులు సంక్రాతి తర్వాత బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. టీఆర్ఎస్ పార్టీ పాత సీనియర్ నాయకులు ఒకటై తిరుగుతుండటంతో ఎమ్మెల్యేకు ఎదురుగాలి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed