సీనియర్ పాత్రికేయులు ముళ్లపూడి సదాశివ శర్మ కన్నుమూత

by  |
సీనియర్ పాత్రికేయులు ముళ్లపూడి సదాశివ శర్మ కన్నుమూత
X

దిశ, సిటీబ్యూరో: నాలుగు దశాబ్దాల పాటు వివిధ భాషల్లోని దిన పత్రికపత్రికల్లో అమూల్యమైన సేవలు అందించిన సీనియర్ పాత్రికేయులు ముళ్లపూడి సదాశివశర్మ(61) ఇక లేరు. వారం రోజులుగా ఇంటిలోనే జ్వరంతో బాధపడుతున్న ఆయన బాగా నీరసించి పోవటంతో కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు తుది శ్వాస వదిలినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శర్మకు భార్య, కుమార్తె, ఓ సోదరుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్టులు మూసారాంబాగ్‌లోని ఆయన నివాసానికి చేరుకుని శర్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. మూసారాంబాగ్ ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో ఉన్న హిందూ స్మశాన వాటికలో శుక్రవారం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.

1980 లో పాత్రికేయ రంగంలోకి వచ్చిన శర్మ నేడు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న పలు పత్రికల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. ఎంతో మంది ఔత్సాహిక పాత్రికేయులను తయారు చేశారు. రెండు పర్యాయాలుగా పదేళ్ల పాటు హిందీ మిలాప్ దినపత్రికలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎడిటర్‌గా సేవలందించారు. ఆంధ్రప్రభ దినపత్రికకు కూడా సేవలందించిన శర్మ 2018 నుంచి ఆంధ్రభూమి పత్రికకు రెసిడెంట్ ఎడిటర్ గా సేవలందించారు.

sir-2

ప్రముఖ పత్రికలు స్థాపించిన జర్నలిజం స్కూల్లో ఫ్యాకల్టీగా పనిచేశారు. పలు పత్రికల్లో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మంచి ఫలితాలనివ్వటంతో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు ప్రతిష్టాత్మకమైన కీర్తి పురస్కారాన్ని ప్రధానం చేసి ఘనంగా సత్కరించింది. సున్నితమైన మనస్తత్వం, నిత్యం నిరాడంబరంగా ఉండే వ్యక్తిత్వం శర్మ సొంతం. కాగా, ఆయన మరణంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. దేశం మరో మంచి పాత్రికేయుడిని కొల్పోయిందని అన్నారు.

Next Story