దిగజారుతున్న హోల్ సేల్ వాహనాల అమ్మకాలు.. ఎందుకంటే ?

by  |
CARS
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఆటో పరిశ్రమలో సెమీకండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తిపై ప్రభావంతో భారత ఆటో హోల్‌సేల్ విక్రయాలు ఆగష్టులో 11 శాతం పడిపోయాయని పరిశ్రమల సంఘం సియామ్ వెల్లడించింది. కమర్షియల్ వాహనాలు మినహా మొత్తం టోకు విక్రయాలు గత నెలలో 15,86,873 యూనిట్లకు పడిపోయాయని శుక్రవారం ప్రకటనలో సియామ్ తెలిపింది. గతేడాది ఇదే నెలలో మొత్తం 17,90,115 యూనిట్లుగా నమోదయ్యాయి. సెమీకండక్టర్ల కొరత, ఇతర విడిభాగాల ధరలు అత్యధికంగా ఉండటమే అమ్మకాల క్షీణతకు ప్రధాన కారణాలని సియామ్ అభిప్రాయపడింది.

ఇక, తయారీదారుల నుంచి డీలర్‌ల వద్దకు చేరిన ద్విచక్ర వాహనాలు ఆగష్టులో 15 శాతం తగ్గి 13,31,436 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020, ఇదే నెలలో మొత్తం 15,59,665 యూనిట్లుగా నమోదైనట్టు సియామ్ పేర్కొంది. ‘సరఫరా వ్యవస్థలో సవాళ్లు అధికమవడంతో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఒత్తిడికి లోనవుతోంది. అంతర్జాతీయంగా సెమీ కండక్టర్ల కొరత ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం పరిశ్రమ అంతట ఔట్‌పుట్ పట్ల తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. దీనికి అదనంగా విడిభాగాల ధరలు అత్యధికంగా ఉండటం ఉత్పత్తి వ్యయం పెరిగేందుకు కారణమవుతోందని’ సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు.


Next Story

Most Viewed