హెల్మెట్ కొంటున్నారా.. ఆ ముద్ర ఉంటేనే తీసుకోండి

by  |
హెల్మెట్ కొంటున్నారా.. ఆ ముద్ర ఉంటేనే తీసుకోండి
X

దిశ, గచ్చిబౌలి: నగరంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు​నిబంధనలను కఠినతరం చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. ఫొటోలను చిత్రీకరించి నేరుగా ఇంటి అడ్రస్‌కు చలానా పంపుతున్నారు. దీంతో నగరంలో హెల్మెట్​కొనుగోళ్లు పెరిగాయి. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు నకిలీ హెల్మెట్లను విక్రయిస్తూ వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హెల్మెట్​కొనుగోలు చేసేప్పుడు నకిలీ ఏదో, ఒరిజనల్​ఏదో గుర్తించాలని, ఐఎస్ఐ ముద్రగల హెల్మెట్లను వాడాలని నిఫుణులు పేర్కొంటున్నారు.

వాహనదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ తయారీదారులు, విక్రయదారులు సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యత గల హెల్మెట్​కొనుగోలు చేయాలంటే రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు ఖర్చు చేయాల్సిందే. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు నాసీరకం హెల్మెట్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం ట్రాఫిక్ పోలీసుల జరిమానాల నుంచి బయటపడేందుకు హెల్మెట్ ధరిస్తున్నారు. నాసీకరం హెల్మెట్ ధరించడంతో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా గాయపడే అవకాశం ఉంటుంది. ఒరిజినల్​హెల్మెట్​రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలు కాకుండా కాపాడుతుంది. కానీ, ప్రస్తుతం మార్కెట్లో హెల్మెట్ వల్ల ప్రమాదం జరిగితే మృతి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్, చందానగర్, మదినగూడ, హఫీజ్‌పేట్, మియాపూర్‌లో నకిలీ హెల్మెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి.

హెల్మెట్‌కి కొత్త రూల్స్?

హెల్మెట్ ఎలా ఉండాలన్నదానిపై ఇన్నాళ్లూ పట్టించుకోని కేంద్రం ఇప్పుడు వాటికీ రూల్స్ తేబోతున్నట్లు సమాచారం. బైక్, స్కూటీల వంటి టూవీలర్​ వాహనదారుల హెల్మెట్లకు బీఐఎస్( బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్) సర్టిఫికేషన్ ఉండాలట. ఈ రూల్ ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీని ప్రకారం ఇండియాలో తయారయ్యే హెల్మెట్లన్నీ బీఐఎస్ రూల్స్ ప్రకారమే ఉండాలి. కొత్త రూల్ అమల్లోకి వస్తే బీఐఎస్ రూల్స్‌ ప్రకారం లేని హెల్మెట్లను వాడడానికి వీలుండదు. అలాంటివి వాడితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. ఇది ముసాయిదా కాబట్టి దీనిపై కొంత కసరత్తు చేస్తారు. తర్వాత ఫైనల్ రూల్ వస్తుంది.

హెల్మెట్‌తో రక్షణ..

వాహనదారులకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా కఠినమైన నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. కచ్చితంగా అందరూ పాటించాల్సిందే. హెల్మెట్ లేకుండా జరిగే ప్రమాదాల్లో ఎక్కువశాతం తలకు బలమైన గాయాలతో మృతి చెందుతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలి. – చంద్రశేఖర్, ఏసీపీ కూకట్‎పల్లి ట్రాఫిక్

Next Story