సీజ్ చేసిన లిక్కర్ మాయం.. కానిస్టేబుల్‌పై కేసు

by  |
సీజ్ చేసిన లిక్కర్ మాయం.. కానిస్టేబుల్‌పై కేసు
X

దిశ, కరీంనగర్: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న ధీమాతో సీజ్ చేసిన లిక్కర్‌ను కోర్టులో డిపాజిట్ చేయకుండా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఠాణాలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వైన్ షాపుపై పోలీసులు దాడి చేసి పట్టుబడిన మద్యాన్ని సీజ్ చేశారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కోర్టులో డిపాజిట్ చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో మార్కెట్లో మద్యం దొరకని పరిస్థితి నెలకొంది. కళ్ల ముందు కనిపిస్తున్న మద్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చనుకున్న ఓ కానిస్టేబుల్, మరో టెంపరరీ ఉద్యోగి కలిసి ఏకంగా 69 బాటిళ్లను స్టేషన్ స్ట్రాంగ్ రూం నుంచి ఎత్తుకెళ్లారు. గుట్టు చప్పుడు కాకుండా చేసిన వీరి వ్యవహారం గురించి సీపీ కమలాసన్ రెడ్డి చెవిన పడటంతో ఆయన సీసీఎస్ పోలీసులను సీక్రెట్‌గా విచారించాలని ఆదేశించారు.

ఈ క్రమంలో విచారణ అనంతరం సీసీఎస్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఓ కానిస్టేబుల్‌తో పాటు, టెంపరరీ ఉద్యోగిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, సీజ్ అయిన మద్యం బాటిళ్లను పోలీసులు కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని బాటిళ్లను సైంటిఫిక్‌గా నిర్దారించుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తారు. మిగతా బాటిళ్లను స్టేషన్ స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కూడా ఇదే పద్ధతిని అవలంభించారు. కోర్టులో డిపాజిట్ చేయాల్సిన లిక్కర్ బాటిళ్లను కోర్టు కానిస్టేబుల్‌కు అప్పగించగా, ఆయన వాటిని స్టేషన్‌లోనే ఓ గదిలో భద్రపర్చి తాళం వేసుకున్నారు. అయితే, ఆ మద్యాన్ని విక్రయించాలన్న ఆలోచన రావడంతో దొరికిపోకుండా ఉండేందుకు తాళం పగలగొట్టకుండా గొల్లెం స్క్రూలను తొలగించి బాటిళ్లను చోరీ చేసినట్టు విచారణలో తేలింది. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా వివరాలు సేకరించినట్టు పోలీసులు వెల్లడించారు.

Tags : liquor Seize, Liquor, stolen, police Case, constable, karimnagar, court


Next Story

Most Viewed