టెక్నిక్‌లో లోపం లేదు : సెహ్వాగ్

by  |
టెక్నిక్‌లో లోపం లేదు : సెహ్వాగ్
X

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్ వాష్ అవడానికి విరాట్ కొహ్లీ వైఫల్యాలే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. అతడి చేతికి, కంటికి మధ్య సమన్వయ లోపం వల్లే మునపటి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడని పలువురు మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కివీస్ పర్యటనలో కోహ్లీ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదని, కేవలం ఫామ్‌ను కోల్పోవడం వల్లే అతడికి కలసి రాలేదని సెహ్వాగ్ కోహ్లీని వెనకేసుకొచ్చాడు.

ఫామ్ లేమితో తంటాలు పడేవాళ్లు ఏం చేసినా కలసి రాదని.. అదే సమయంలో కివీస్ పేసర్లను ఎదుర్కోవడంలోనూ కోహ్లీ విఫలమయ్యాడని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అంతేకాని అతని కంటికి, చేతికి మధ్య సమన్వయం లేదనడాన్ని తప్పుబట్టాడు. కివీస్ పర్యటనలో ఆడిన రెండు టెస్టుల్లో కలిపి కోహ్లీ 9.50 సగటుతో కేవలం38 పరుగులే చేశాడు. ఈ మధ్య కాలంలో కోహ్లీ ఇంత దారుణమైన గణాంకాలు నమోదు చేయడం తొలిసారి.

మరోవైపు కివీస్ పర్యటనలో ఆడిన నాలుగు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో కలిపి అతడి మొత్తం స్కోర్ కేవలం 218 పరుగులు మాత్రమే. రెగ్యులర్ ఓపెనర్లు లేకపోవడం, కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమవడం భారత జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.

tags : Kohli, Sehwag, former Cricketers, lack of technique, Nz vs Ind


Next Story