బిగ్‌ బ్రేకింగ్.. ఎస్బీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు కాల్పులు

by  |
బిగ్‌ బ్రేకింగ్.. ఎస్బీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు కాల్పులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు కలకలం రేపాయి. అబిడ్స్‌లోని ఎస్బీఐ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు.. అదే బ్యాంకులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సదరు ఉద్యోగికి తీవ్రగాయాలు కాగా.. కాల్పుల మోతతో బ్యాంకు పని కోసం వచ్చిన వారు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి సురేందర్‌, సెక్యూరిటీ గార్డు సర్దార్‌ ఖాన్‌లు స్నేహంగానే ఉండేవారు. కానీ, గత కొన్ని రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. సురేందర్ సెక్యూరిటీ మీద జోక్స్‌ వేయడంతో వాగ్వాదం జరిగేది. ఇదే క్రమంలో బుధవారం మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో చేతిలో ఉన్న తుపాకీతో సురేందర్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు సర్దార్ ఖాన్. మూడు రౌండ్లు కాల్పులు జరపగా.. బులెట్లు సురేందర్ రిబ్స్‌లోకి చొచ్చుకెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితుడిని హైదర్‌గూడలోని అపొలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకొని కాల్పులు జరిపిన సర్దార్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ వెంకట్‌ రెడ్డి తెలిపారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.



Next Story