సచివాలయ భవనాలు ఖాళీ

by  |
సచివాలయ భవనాలు ఖాళీ
X

దిశ, న్యూస్ బ్యూరో: పాత సచివాలయ భవనాల్లోని సామగ్రి తరలిపోతున్నది. ఇప్పటికే దాదాపు అన్నింటినీ తీసుకెళ్లగా.. కంప్యూటర్ సర్వర్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను రెండు రోజులుగా లారీల్లో పట్టుకెళ్తున్నారు. ఇటీవల పాత సచివాలయాన్ని కూల్చివేయవచ్చు అంటూ హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో పనులను ముమ్మరం చేశారు.

నిజాం కాలేజీ గ్రౌండ్ కు పాత వాహనాలు

ఇంతకాలం హెలీపాడ్ దగ్గర శిథిలంగా పడి ఉన్న కార్లు, బైక్‌లు, ఆటోలను సైతం ట్రాఫిక్​ పోలీసులు నిజాం కాలేజీ గ్రౌండ్​కు తరలిస్తున్నారు. ఆ వాహనాలన్నీ ప్రభుత్వ విభాగాలకు చెందినవే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచే స్క్రాప్‌లా పడి ఉన్నాయి. ఇందులో 100కు పైగా కార్లు, జీపులు, మరికొన్ని బైక్‌లు, కొన్ని ఆటోలు ఉన్నాయి. వీటిలో కొన్ని చిన్నపాటి రిపేర్లు చేస్తే పనికొచ్చే వాహనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ వాహనాల కండిషన్‌ను అంచనా వేసి రవాణాశాఖ వాటికి ధరలను నిర్ణయించనుంది. ఆ తర్వాత బహిరంగ వేలం ద్వారా విక్రయించనుంది. ఈ వ్యవహారాన్ని జీఏడీ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శులు సమన్వయం చేస్తున్నారు. అయితే ఈ వాహనాల్లో కొన్ని ఏపీకి సంబంధించినవి సైతం ఉన్నాయి. ఇటీవల జుడీషియరీ విభాగంలోని అధికారులు, ఆ పై స్థాయిల్లోని జడ్జీలు, ఇతరుల నుంచి నిర్దిష్ట కాలం దాటిపోయిన కార్లు, జీపులను వెనక్కి పంపించింది. వీటిలో అధిక శాతం కండీషన్‌లోనే ఉన్నాయని, వాటికి కనీస ధర నిర్ణయించి వేలం వేయాలని అధికారులు భావిస్తున్నారు.

పనులు ఎప్పటి నుంచో..!

తరలింపు ముమ్మరంగా సాగుతున్నా.. కూల్చివేత పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయనేది తెలియకుండా ఉంది. ఏ సంస్థకు కాంట్రాక్టు ఇస్తుంది, కొత్త సచివాలయం నిర్మాణం ఎప్పుడు ప్రారంభం కావచ్చు, దాని డిజైన్ ఎలా ఉంటుందనే అంశాలపై ప్రభుత్వాధికారులు పెదవి విప్పడానికి నిరాకరిస్తున్నారు.


Next Story

Most Viewed