రెండో రోజూ.. సక్సెస్

by  |
రెండో రోజూ.. సక్సెస్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దేశంలోని 41 బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ జాతీయ సంఘాలు ఇచ్చిన 72 గంటల సమ్మెలో భాగంగా రెండో రోజు సమ్మె కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని బొగ్గు గనులలో కార్మికులు విధులు బహిష్కరించారు. రీజియన్ లోని ఆరు భూగర్భ గనులు, నాలుగు ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో రామగుండం రీజీయన్ లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. రీజియన్ లోని 14 వేల మంది కార్మికులలో అత్యవసర విధులు నిర్వహించే కార్మికులు మినహా ఎవరూ హాజరు కాలేదు. దీంతో మొదటి రోజు 45 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి నిలిచి పోగా రెండో రోజు సైతం 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. రామగుండం రీజియన్ నుంచి ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రానికి రోజు 35 వేల టన్నుల బొగ్గును సింగరేణి సరఫరా చేస్తుండగా సమ్మె కాలంలో నిలువ ఉన్న బొగ్గును రవాణా చేయాలని నిర్ణయించింది. ఇతరాత్ర అవసరాలకు సరఫరా చేయాల్సిన బొగ్గు రవాణా నిలిచి పోయింది. సమ్మెతో కార్మికులు తమ వేతనాలు కోల్పోయారు. రెండో రోజు సమ్మెలో భాగంగా బొగ్గు గనులపై జాతీయ కార్మిక సంఘాలైన బీఎంఎస్, ఐఎన్టీయూసీ, ఎఐటీయూసీ, సిఐటీయూ, హెచ్ఎంఎస్ కార్మికులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గనుల సమీపంలో ర్యాలీతో పాటు దర్నా నిర్వహించారు. మొదటి రోజు సమ్మెకు మద్దతు ప్రకటించిన గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ రెండో రోజు సమ్మెకు దూరంగా ఉంది. అయినప్పటికీ కార్మికులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెతో కేంద్రం దిగి వచ్చి వెంటనే బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపి వేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.



Next Story