నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం.. ఏకగ్రీవాలకు బ్రేక్!!

by  |
నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం.. ఏకగ్రీవాలకు బ్రేక్!!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు హోరెత్తిస్తోంది. నిమ్మగడ్డ వర్సెస్ అధికార పార్టీ అన్నట్టు పంచాయతీ ఎన్నికల రగడ నడుస్తోంది. ఏకగ్రీవాలను పెంచేలా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ పలు వ్యూహాలు అమలు చేస్తోంది. కానీ వారి అడుగులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తూనే ఉన్నారు.

ప్రలోభపెట్టి ఏకగ్రీవాలు చేయొద్దు అని మొదటి నుండి చెబుతూవస్తోన్న నిమ్మగడ్డ, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఆయా జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల ఫలితాలను ప్రకటించొద్దని అధికారులకు సూచించారు. రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగులో ఉంచాలని ఆదేశాలిచ్చారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నుండి ఏకగ్రీవాలపై వివరణాత్మక నివేదికను కోరినట్లు తెలిపారు ఈసీ. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో నివేదికల పరిశీలన పెండింగ్ లో ఉన్నట్టు వెల్లడించారు. నివేదికలు పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్న ఈసీ… ఆదేశాలు ఇచ్చేవారకూ ఏకగ్రీవాలను పెండింగ్ లోనే పెట్టాలని అధికారులకు సూచించారు.

ఈ వాచ్ యాప్‌పై హైకోర్టులో విచారణ

ఎస్ఈసీ ఈ వాచ్ యాప్‌పై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. ఎస్ఈసీ ఈ-వాచ్ యాప్ నిలిపివేయాలంటూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఈ-వాచ్ తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. గత యాప్స్ వదిలి ఈ వాచ్ యాప్ ఎందుకు తీసుకొచ్చారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషన్లో ప్రభుత్వాన్ని రెస్పాన్డెంట్‌గా చేర్చారు పిటిషనర్లు. తదుపరి విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

Next Story