స్మార్ట్ ఫోన్‌తో కొవిడ్ టెస్ట్

by  |
స్మార్ట్ ఫోన్‌తో కొవిడ్ టెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి భారత్ సహా ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఇప్పటికీ కొత్త కేసులు బయటపడుతుండగా.. కరోనా పరీక్షలు చేసేందుకు సైతం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఇన్నోవేషన్స్ పుట్టుకొస్తున్నాయి. ఎక్స్‌రేతో టెస్టు చేయొచ్చని గాంధీనగర్ ఐఐటీ విద్యార్థులు కనుగొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా శాస్త్రవేత్తలు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా కొవిడ్‌ను నిర్ధారించొచ్చని పేర్కొన్నారు. అది ఎలాగంటే..

సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాంతికిరణాలు ప్రసరింపజేసే మైక్రోస్కోప్‌ను స్మార్ట్ ఫోన్‌తో జత చేస్తారు. తద్వారా కిరణాలు లాలాజలాన్ని పరిశీలించి పేషెంట్‌లో కరోనా వైరస్ ఉందో లేదో నిర్ధారిస్తాయి. ఈ టెక్నిక్ ఆర్టీ పీసీఆర్ పద్ధతి లాగానే సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తమ అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. యూఎస్ తులనె యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బో నింగ్, ఇతర శాస్త్రవేత్తలు ఈ విధానంపై రీసెర్చ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొవిడ్ టెస్టులు చేయగా కచ్చితమైన రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. ఈ అప్లికేషన్ ద్వారా భవిష్యత్తులో ర్యాపిడ్‌గా కొవిడ్ టెస్టులు చేయొచ్చని.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేయొచ్చని వెల్లడించారు.

లాలాజలాన్ని కాంతిరేఖల ద్వారా పరిశీలించేందుకు సీఆర్ఐఎస్‌పీఆర్ మాలిక్యుల్స్ గుర్తించే ప్రొటోటైప్ చిప్‌ను యూజ్ చేశారు. ఈ చిప్ స్మార్ట్ ఫోన్‌తో ఇంటిగ్రేట్ అయి లాలాజలాన్ని రీడ్ ఔట్ చేసి, కరోనా ఉందో లేదో తేలుస్తుంది. ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్ మాదిరిగానే స్వాబ్ శాంపిల్‌ను పరిశీలించి సైకిల్ థ్రెష్ హోల్డ్ విలువ (సీటీ వాల్యూ) ఆధారంగా పాజిటివ్ లేదా నెగెటివ్ అని నిర్ధారిస్తుంది. ఇదంతా ఎలాంటి లేబొరేటరీల అవసరం లేకుండా కేవలం15 నిమిషాల్లో జరుగుతుంది.

Next Story

Most Viewed