ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసమే స్కూళ్లు తెరిచారా..?

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసమే స్కూళ్లు తెరిచారా..?
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న త‌రుణంలో పాఠ‌శాల‌లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమ‌తినివ్వడం చ‌ర్చనీయాంశ‌మైంది. కేసులు త‌క్కువ‌గా న‌మోదతున్నత‌రుణంలో ఎందుకు తెరువ‌లేదు? ఇందులో మ‌ర్మమేమిటి అనేది తెలుసుకునేందుకు ప‌లువురు ఆసక్తిని క‌న‌బ‌రుస్తుండ‌గా విస్తుపోయే ప‌లు అంశాలు బ‌హిర్గత‌మవుతున్నాయి. ఈ నెల 14న రాష్ట్రంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్-రంగారెడ్డి – హైద‌రాబాద్, న‌ల్లగొండ‌–వ‌రంగ‌ల్–ఖ‌మ్మం ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు తెరిచేందుకు అనుమ‌తినివ్వని ప‌క్షంలో ఉపాధ్యాయుల ఓట్లు ప‌డే ప‌రిస్థితి లేద‌ని, గ‌త్యంత‌రం లేని స్థితిలో‘ ఓట్లు మాకు , ఫీజులు మీకు’ అనే అంగీకారంతో 6,7,8 త‌ర‌గ‌తులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమ‌తినిచ్చింద‌ని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కార‌ణంగా గ‌త ఏడాది మార్చి నుంచి ప్రభుత్వ పాఠ‌శాల‌తో పాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠ‌శాల‌లు మూత‌ప‌డ్డాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంత‌రం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ త‌ర‌గ‌తులు నిర్వహిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్రభుత్వం కూడా ఉన్నత పాఠ‌శాల విద్యార్థుల‌కు డీడీ, టీ శాట్ ద్వారా పాఠాలు బోధిస్తోంది.

అయితే ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో నెల‌లుగా ఆన్ లైన్ లో బోధ‌న జ‌రుగుతున్నప్పటికీ ఫీజుల వ‌సూలు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో చాలా పాఠ‌శాల‌ల యాజమాన్యాలు వారివ‌ద్ద ప‌నిచేసే ఉపాధ్యాయుల‌కు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ పాఠ‌శాల‌లు యూనీఫాం, నోటు, పాఠ్య పుస్తకాలు, షూస్ అమ్మకాలు చేస్తుంటాయి. నూత‌నంగా చేరే విద్యార్థుల నుంచి అడ్మిష‌న్ ఫీజు కూడా వ‌సూలు చేస్తాయి. క‌రోనా కార‌ణంగా ఈ యేడాది జూన్ లో పాఠ‌శాల‌లు తెరువ‌క పోవ‌డంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు రూ.కోట్ల లో ఆదాయం కోల్పోయాయి. దీంతో పాఠ‌శాల‌లు తెరిచేందుకు ఎప్పుడు అనుమ‌తినిస్తారో అని వారు ఎదురు చూస్తున్న త‌రుణంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వారికి అదృష్టం రూపంలో క‌లిసొచ్చాయి.

ఫీజుల కోసం మెసేజ్‌లు

రాష్ట్రంలోని ఆరు జిల్లాల‌లో ప‌ట్టభ‌ద్రుల ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి 6,7,8 త‌ర‌గ‌తుల విద్యార్థుల కోసం పాఠ‌శాల‌లు తెరిచేందుకు అనుమ‌తినిచ్చింది. దీంతో యాజ‌మాన్యాలు వెంట‌నే పాఠ‌శాల‌లు తెరిచాయి. కొంత మంది విద్యార్థులు క‌రోనా కేసుల కార‌ణంగా పాఠ‌శాల‌ల‌కు హాజ‌రు కాకుండా ఇంటి వ‌ద్ద నుండే ఆన్ లైన్ త‌ర‌గ‌తుల‌కు హాజ‌రవుతున్నారు. ఈ త‌రుణంలో ఎప్పటినుంచో అవ‌కాశంకోసం ఎదురు చూస్తున్న యాజ‌మాన్యాలు వెంట‌నే విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు మెసేజ్ లు పెట్టాయి. పెండింగ్ లో ఉన్న ఫీజులు చెల్లించ‌ని ప‌క్షంలో త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు కానివ్వమ‌ని, ఆన్ లైన్ క్లాసెస్ కు హాజ‌ర‌య్యేందుకు అంగీక‌రించ‌బోమ‌ని హెచ్చరించాయి.

ఇదిలా ఉండ‌గా ప్రైవేట్ పాఠ‌శాలల్లో ప‌నిచేసే వారిలో అధిక శాతం ప‌ట్టభ‌ద్ర ఉపాధ్యాయులే ఉన్నారు. మార్చి 14వ తేదీన జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వీరి ఓట్లు కీల‌కంగా మార‌నున్నాయి. దీంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాఠ‌శాల‌లు తెరిచేందుకు అనుమ‌తినిచ్చి ప్రతిఫ‌లంగా ఆయా పాఠ‌శాలల్లో ప‌ని చేస్తున్న ఉపాధ్యాయుల ఓట్లు అధికార పార్టీకి వేసేలా ష‌ర‌తులు విధించింద‌ని స‌మాచారం. ఏడాది కాలంగా మూసి ఉన్న పాఠ‌శాల‌లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమ‌తినివ్వడంతో పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు కూడా ప్రతిఫ‌లంగా త‌మ పాఠ‌శాల‌ల్లో ప‌ని చేస్తూ ఓటు హ‌క్కు ఉన్న ప‌ట్టభ‌ద్ర ఉపాధ్యాయుల‌ను అధికార పార్టీకి ఓట్లు వేయాల‌ని సూచిస్తున్నాయని, ఇందుకు ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇస్తున్నార‌నే గుస‌గుస‌లు అంత‌టా వినిపిస్తున్నాయి.



Next Story