‘తెలంగాణలోని పథకాలు దేశంలోనే నెంబర్ వన్’

by  |
ministar dayakar rao
X

దిశ, చెన్నూర్ : పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ పైన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మెరుగైన జీవన పరిస్థితులు నెలకొన్నాయని, నిరంతర ప్రక్రియగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రజలంతా భాగస్వాములై పల్లెల ప్రగతికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే కోరిన నిధులు అందజేస్తూ కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటున్నామని వారు ప్రకటించారు. గత ప్రభుత్వాలు గ్రామాల్లో ఉన్న సమస్యలపై నిర్లక్ష్యం వహించారని ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం నుండి మంత్రిగా పదవి పొందినప్పటికీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని వారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గ్రామాలతో పాటు, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని, ప్రతినెలా గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వారన్నారు. నాలుగో విడత పల్లె ప్రగతి మహా యజ్ఞంలా కొనసాగుతోందని, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పల్లెలను అభివృద్ధి పరుచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి , జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed