మ్యాచ్ డ్రా.. బోణీ కొట్టని ఈస్ట్ బెంగాల్

by  |
మ్యాచ్ డ్రా.. బోణీ కొట్టని ఈస్ట్ బెంగాల్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి తిలక్ మైదాన్ స్టేడియంలో ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. టాస్ గెలిచి జంషెడ్‌పూర్ క్లబ్ కిక్ ఆఫ్ చేయడానికి నిర్ణయించుకుంది. ఇరు జట్లు మ్యాచ్ మొదటి నిమిషం నుంచి దూకుడుగా ఆడాయి. 21వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ జట్టు ఆటగాడు లింగ్డో ఎల్లోకార్డ్‌కు గురయ్యాడు. మరో నాలుగు నిమిషాల తర్వాత లింగ్డోకు మరో ఎల్లోకార్డ్ కారణంగా రెడ్ కార్డు చూపించారు. దీంతో అతడు ఫీల్డ్ వదలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ అంతా 10 మంది ఆటగాళ్లతోనే ఈస్ట్ బెంగాల్ ఆడాల్సి వచ్చింది. తొలి అర్దభాగంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి.

రెండో అర్దభాగంలో కూడా ఇరు జట్లు పలుమార్లు గోల్ పోస్టులపై దాడులు చేసుకున్న స్కోర్ సాధించడంలో విఫలమయ్యాయి. రెండో అర్దభాగంలో జంషెడ్‌పూర్ క్లబ్ ఆటగాడు లాల్దిలియానా రెండు సార్లు ఎల్లో కార్డుకు గురై ఫీల్డ్ వదిలాడు. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఇదే తొలి డ్రా. ఇంత వరకు ఈ జట్టు విజయం సాధించలేదు. డ్రా కారణంగా ఈ సీజన్‌లో ఈస్ట్ బెంగాల్ తొలి పాయింట్లు సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మొహమ్మద్ మొబాషిర్‌, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మొహమ్మద్ ఇర్షాద్ గెలుచుకున్నారు.



Next Story

Most Viewed