టెస్టింగ్ కిట్లు దగ్గర పడ్డయ్!

by  |
టెస్టింగ్ కిట్లు దగ్గర పడ్డయ్!
X

కొవిడ్-19 నిర్ధారణ ఫలితాలు నిమిషాల్లోనే తెలుసుకునేందుకు ఉపయోగించే ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు నిజామాబాద్ జిల్లాలో ఒడుస్తున్నాయి. జూలై 6 నుంచి జనరల్ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో కరోనా టెస్టులు చేస్తున్నారు. కాగా, రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 2,800 ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు పంపించింది. ప్రస్తుతం ఈ కిట్లు దగ్గర పడుతున్నాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వైరాలజీ ల్యాబ్‌లో నిర్వహించే పరీక్షల సామర్థ్యాన్ని తొలుత రోజుకు 30 టెస్టుల నుంచి 500 వరకు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో పరీక్షల నిమిత్తం ప్రభుత్వం కేవలం 2,800 కిట్లను కేటాయించింది. వాటితో పరీక్షలను తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు చేయాలని నిర్ణయించడంతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహణ రెండు, మూడు రోజులకే దగ్గర పడ్డాయి. ఆయా ప్రాంతాలకు కేటాయించిన వాటితో పరీక్షలను నిర్వహించి పరీక్షలకు జిల్లా జనరల్ ఆసుపత్రికి, వైరాలజీ ల్యాబ్‌లకు రెఫర్ చేస్తున్నారు.

పీహెచ్‌సీల్లో కిట్లు లేవు!

కిట్ల కొరత కారణంగా పీహెచ్‌సీల్లో పరీక్షల నిర్వహణ జరగని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 2800 ర్యాపిడ్ యాంటిజన్ కిట్‌లను కేటాయించగా, వాటిలో 380 కొవిడ్ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్, జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులకు 500, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు 300, ఒక్కో పీహెచ్‌సీకి 10 నుంచి 15 వరకు కేటాయించారు. ఇప్పటి వరకు మొత్తం 2,188 మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. అందులో 2098 శాంపిళ్ల ఫలితాలు వచ్చాయి. అందులో 1,772 మందికి నెగెటివ్ రాగా, 489 మందికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన 84 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో 22 మంది వైరస్‌తో చనిపోయారు. ర్యాపిడ్ యాంటిజన్ కిట్ల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో 55 మందికి పాజిటివ్ అని తేలింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 84 మందికి మాత్రమే పరీక్షను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో నిత్యం 30 కేసులకు పైగా పాజిటివ్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పరీక్షలను పెంచాల్సిన సమయంలో ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు ఒడిసిపోతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటి వరకు 543 కేసులు..

లాక్‌డౌన్ కాలంలో 61 పాజిటివ్ కేసులకు పరిమితమైన నిజామాబాద్ జిల్లాలో అన్ లాక్‌డౌన్ అనంతరం 543 కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సంబంధించిన పాజిటివ్ కేసులు పూటకోచోట వెలుగు చూస్తున్న సమయంలో త్వరగా టెస్టుల ఫలితాలు వచ్చే ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు సరిపడా లేకపోవడంతో సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో ప్రస్తుతం కొవిడ్ ఆస్పత్రిలోని వైరాలజీ ల్యాబ్, జిల్లా ఆసుపత్రి, ఒక ఏరియా ఆసుపత్రి, రెండు సీహెచ్‌సీల్లో మాత్రమే పరీక్షలను చేస్తున్నారు. పాజిటివ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్‌లు ఉన్నవారికి, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మాత్రమే చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కిట్‌లు లేక ఆయా ప్రాంతాల ప్రజలు మిగిలిన ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు.



Next Story

Most Viewed