బ్రోచర్లతో బురిడీ కొట్టిస్తారు.. జాగ్రత్తగా ఉండండి

by  |
బ్రోచర్లతో బురిడీ కొట్టిస్తారు.. జాగ్రత్తగా ఉండండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మా సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్మించింది. ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ల్లో అనేక నిర్మాణాలను చేపట్టాం. వరల్డ్ క్లాస్ నిర్మాణాలు చేపట్టిన ఘనత మాది.. అంటూ అందమైన చిత్రాలతో, ఆకట్టుకునే బ్రోచర్లతో విస్తృతంగా ప్రచారం చేస్తూ పలు నిర్మాణ సంస్థలు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థల పేరు వినగానే వినియోగదారులు అట్రాక్ట్ కావడం సహజం. ఇదే అదనుగా హైదరాబాద్ మహానగరంలోనూ కొన్ని బడా సంస్థలు దగా చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ, రెరా అథారిటీల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొత్త ప్రాజెక్టుల పేరిట ప్లాట్ల విక్రయాలను ఆరంభించాయి. నిర్మాణానికి ముందే వంద శాతం చెల్లిస్తే చదరపు అడుగు ధర రూ.3,499 అంటూ ప్రచారానికి తెర తీశాయి. అది ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్ అంటూ అమాయకులను నమ్మిస్తున్నాయి. రెరా, జీహెచ్ఎంసీ అనుమతులు లభించగానే రేట్లు పెంచేస్తామంటున్నాయి. అదేదో ఇప్పుడే కడితే అతి తక్కువ ధరకే సొంతింటి భాగ్యం కలుగుతుందంటూ ప్రచారం చేస్తున్నాయి.

ప్రధాన దినపత్రికల్లో అడ్వర్వైజ్‌మెంట్లు ఇస్తున్నారు. ఎక్కడెక్కడో పూర్తి చేసిన ప్రాజెక్టులను బూచిగా చూపిస్తున్నారు. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా వారికి వారే ధ్రువీకరించుకుంటున్నారు. ప్రాజెక్టులకు అందమైన పేర్లు పెడుతున్నారు. మీ ఊహకందని రీతిలో సౌకర్యాలు కల్పిస్తాం.. వరల్డ్ క్లాస్ ఎమినిటీస్ అందిస్తామంటూ బ్రోచర్లలో, ప్రకటనల్లో ఊదరగొడుతున్నారు. ఆ చిత్రాలతో కనువిందు చేస్తున్నారు. ప్రీ లాంఛ్ ఆఫర్లకు బదులుగా స్పెషల్ లాంఛ్ ఆఫర్లంటూ ప్రకటిస్తున్నాయి. నిజానికి ఆయా సంస్థలు ఒక ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ, రెరా అనుమతులు తీసుకున్నాయి. కానీ చేపట్టబోయే ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్పెషల్ ఆఫర్ల పేరిట అమ్మకాలను సాగిస్తున్నాయి. మియాపూర్, చందానగర్, బాచుపల్లి, నిజాంపేట, కోకాపేట తదితర ప్రాంతాల్లో కొన్ని సంస్థలు రెరా అనుమతి లేకుండానే ఫ్లాట్ల అమ్మకాలను మొదలు పెట్టాయని విశ్వసనీయంగా తెలిసింది. ప్రత్యేక రాయితీలు చూసి 100 శాతం చెల్లిస్తే అందే సదుపాయాల కంటే అనుమతి లేకుండా చేపట్టే ప్రాజెక్టుల్లో కొనుగోళ్ల ద్వారా కలిగే నష్టాలను వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్ల పేరిట..

చెన్నైకి చెందిన ఓ ప్రధాన నిర్మాణ సంస్థ హైదరాబాద్‌లో సరికొత్త అక్రమానికి తెర లేపింది. జీహెచ్ఎంసీ, రెరా అథారిటీల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బాచుపల్లిలో కొత్త ప్రాజెక్టులో ఫ్లాట్ల విక్రయాల్ని ఆరంభించింది. ముందే వంద శాతం సొమ్ము కడితే చదరపు అడుగు ధర రూ.3400 మాత్రమే అంటోంది. ఇన్వెస్ట్ మెంట్ ఆఫర్ అంటూ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఛానెల్ పార్టనర్ల ద్వారా ఇలాంటి అక్రమ విధానంలో ఫ్లాట్ల అమ్మకానికి శ్రీకారం చుట్టింది. 36 నెలల్లో అందిస్తామంటున్నాయి. కానీ 100 శాతం డబ్బులు చెల్లించడం ద్వారా ప్రీ లాంఛ్ ఆఫర్ లేదా స్పెషల్ ఆఫర్‌గా పొందొచ్చునంటూ ప్రచారం చేస్తున్నాయి. ఆ సంస్థ గతంలో చేపట్టిన ప్రాజెక్టులను, ఇతర నగరాలు, దేశాల్లోని ప్రాజెక్టులను కూడా ప్రచారంలో భాగంగా ప్రస్తావిస్తున్నారు.

అసలు గిమ్మిక్కులు ఎందుకు?

కేవలం చెన్నై కి చెందిన సంస్థ మాత్రమే కాదు. హైదరాబాద్‌లోని పలు సంస్థలు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను అమ్ముతున్నాయి. ఆ జాబితా పెద్దదే.. తెలంగాణ రాష్ట్రం ఆధునిక ఆవిష్కరణల్లో చాలా ముందుంది. కొందరు బిల్డర్లు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అక్రమ పద్ధతుల్లో ఫ్లాట్లను అమ్ముతున్నారు. జీహెచ్ఎంసీ, రెరా అథారిటీ నుంచి అనుమతి లేకుండా నిస్సిగ్గుగా విక్రయిస్తున్నారని సమాచారం. ఒకవైపు స్థలం కొనుగోలు చేశామని ఈ సంస్థ చెబుతూనే మరోవైపు ఎందుకిలా అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను విక్రయిస్తుంది? అసలు హైదరాబాద్‌లో యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు విక్రయించమని ఈ సంస్థలకు చెప్పిందెవరు? కొనుగోలుదారులు యూడీఎస్ అయితేనే కొనుగోలు చేస్తామని అంటున్నారా? మరి ఇలా అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మడమెందుకు? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో వినియోగదారులు ఆరా తీయాలి. విచారణ చేసి ఎలాంటి అనుమానాలు లేకపోతేనే ఫ్లాట్లు ముందస్తుగా కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అనుమతికి ముందే అమ్మకాలు

హైదరాబాద్‌లో పేరు, ప్రఖ్యాతలు గల కొన్ని నిర్మాణ సంస్థలు.. స్థానిక సంస్థలు, రెరా అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నాకే ఫ్లాట్లను విక్రయిస్తుంటాయి. కొంత కాలంగా పలు నిర్మాణ సంస్థలు ఇలా అక్రమ బాట పట్టాయి. వంద శాతం సొమ్ము చెల్లిస్తే మార్కెట్ రేటు కంటే సగానికే ఫ్లాట్లను అందజేస్తామని చెబుతున్నాయి. చెన్నై, బెంగుళూరు కేంద్రంగా నడిచే సంస్థలతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా ఫ్లాట్లను అమ్మే సంస్థలకు క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ వంటి సంఘాలు సభ్యత్వాలను ఇస్తున్నాయి. అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మే సంస్థలకు రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించే సంఘాలు సభ్యత్వాలను ఎందుకు ఇస్తున్నాయో అంతు చిక్కడం లేదని కొందరు బిల్డర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రెరా అథారిటీ కూడా ఇలా అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని, నిజాయితీగా ఫ్లాట్లను కట్టే సంస్థలకు, అక్రమ కంపెనీల మధ్య తేడా ఉండకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed