జీడీపీ వృద్ధి అంచనాలను సవరించిన ఎస్‌బీఐ.!

by  |
జీడీపీ వృద్ధి అంచనాలను సవరించిన ఎస్‌బీఐ.!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి సానుకూల పరిణామాల నేపథ్యంలో భారత జీడీపీ అంచనాలను కొంత సానుకూలానికి సవరిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)పరిశోధనా నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక జీడీపీ (GDP) అంచనాలను 12.5 శాతం నుంచి 10.7 శాతం ప్రతికూలానికి మెరుగు పరుస్తున్నట్టు శుక్రవారం ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక పేర్కొంది. ‘కొవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడే నష్టాలు తగ్గాయి. అయితే, వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు సానుకూలంగా కొనసాగుతున్నందున దేశ వృద్ధిరేటు అంచనాలను మెరుగుపరిచామని’ ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ నివేదికలో తెలిపారు.

పరిశ్రమల కార్యకలాపాలు, సేవా కార్యకలాపాలు, ప్రపంచ అర్థిక వ్యవస్థతో సంబంధం ఉన్న సూచీలను పరిగణలోకి తీసుకున్నాము. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని సానుకూలంగా 12.5 శాతం నుంచి 10.7 శాతం ప్రతికూలానికి సవరించాము. అలాగే, మూడో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మరింత మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నామని’ డాక్టర్ సౌమ్య క్రాంతి నివేదికలో పేర్కొన్నారు. అయితే, రెండో త్రైమాసికానికి సంబంధించి వాస్తవ జీడీపీ సంఖ్యల తర్వాత మాత్రమే మూడో త్రైమాసికంలో ఎంతమేరకు కోలుకుంటుందో అంచనా వేయగలని నివేదిక స్పష్టం చేసింది. దేశ ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందనడంలో సందేహం లేదని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కొవిడ్-19 మహమ్మారి దెబ్బతీసిందని నివేదిక అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలోనూ కార్పొరేట్ ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని నివేదిక తెలిపింది.

Next Story