ప్రధాని కేర్స్ ఫండ్‌కు ఎస్‌బీఐ విరాళం!

by  |
ప్రధాని కేర్స్ ఫండ్‌కు ఎస్‌బీఐ విరాళం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి కేర్స్ ఫండ్‌కు రూ. 62.62 కోట్లను కేటాయించినట్టు తెలిపింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎస్‌బీఐలోని సుమారు 2.50 లక్షల మంది ఉద్యోగులు ఈ మొత్తాన్ని విరాళం రూపంలో ఇచ్చినట్టు గురువారం బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎస్‌బీఐ ఉద్యోగులు ప్రధాన మంత్రి కేర్ ఫండ్‌కు విరాళం అందజేయడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ‘కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే తమ ఉద్యోగులు వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను అందించారని, అందుకు ఎంతో గర్విస్తున్నాం.

మా ఉద్యోగులు సేవలందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారని, అంతేకాకుండా కొవిడ్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రానికి మద్దతుగా స్వచ్ఛందంగా ప్రధాన మంత్రి కేర్స్ ఫండ్‌కు విరాళం ఇచ్చినట్టు’ ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. భవిష్యత్తులోను కరోనా కారణంగా ఎదుర్కోబోయే సవాళ్ల పరిష్కారంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు ఎస్‌బీఐ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, గతేడాది ఎస్‌బీఐ తన వార్షిక లాభంలో 0.25 శాతం కరోనా నియంత్రణ కోసం మాస్కులు, శానిటైజర్ల సరఫరాకు విరాళం ఇచ్చింది. అలాగే, ఎస్‌బీఐ ఉద్యోగులు ప్రధాని కేర్స్ ఫండ్‌కు రూ. 107 కోట్లను విరాళంగా ఇచ్చారు.



Next Story

Most Viewed