జూన్ 30 నాటికి పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న ఎస్‌బీఐ

by  |
జూన్ 30 నాటికి పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న ఎస్‌బీఐ
X

దిశ, వెబ్ డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వినియోగదారుల పాన్‌కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానంపై ఓ ప్రకటన విడుదల చేసింది. పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేసుకునేందుకు జూన్ 30 వరకు గడువు ఇస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది. నెలాఖరులోగా లింక్ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల పాన్‌కార్డ్ చెల్లదని స్పష్టం చేసింది. ఒకవేళ చేయకపోతే ఆదాయ పన్ను రిటర్నుల(ఐటీఆర్)కు, ఆన్‌లైన్ లావాదేవీలకు ఆటంకాలు ఏర్పడతాయని తెలిపింది.

ఇదివరకే దీనికి సంబంధించి పలుమార్లు ఎస్‌బీఐ హెచ్చరించిందని, తాజాగా మే నెలాఖరు వరకు ఉన్న గడువును ఇప్పుడు జూన్ చివరికి పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. పాన్‌తో ఆధార్ లింక్ చేయకుంటే రూ. వెయ్యి జరిమానా పడుతుంది. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాదారులందరూ ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని కోరింది.

అంతేకాకుండా, బ్యాంకింగ్ సేవల విషయంలో ఎలాంటి ఆటంకాలు, అంతరాయాలు లేకుండా ఉండేందుకు ఇది తప్పనిసరి అని వివరించింది. కరోనా మహమ్మారి కారణంతో ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేందుకు ఈ ఏడాది మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఎవరైనా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది.


Next Story