బొట్టు బొట్టునూ ఒడిసి పట్టు: కేటీఆర్

by  |
బొట్టు బొట్టునూ ఒడిసి పట్టు: కేటీఆర్
X

దిశ, హైదరాబాద్: ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకుగానూ వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను అధికంగా చేపట్టాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లో వాటర్ బోర్డు వారు నిర్మించిన రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ థీమ్ పార్కును శుక్రవారం సందర్శించారు. అక్కడే వాటర్ బోర్డు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నీటి సంరక్షణపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు ఈ థీమ్ పార్కు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఇక్కడ రూపొందించిన 42 నీటి సంరక్షణ నమూనాలు, పద్ధతులు విద్యార్థులను ఆకట్టుకునేలా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. అలాగే, రానున్న వేసవిలో ఓఆర్ఆర్ గ్రామాల్లో నీటి ఇక్కట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ శివారు మున్సిపాలిటీల్లో మార్చి 1నుంచి పక్కా ప్రణాళికతో సెవరెజీ నిర్వహణకు సన్నద్ధం కావాలన్నారు. ఇందులో భాగంగా వాటర్ బోర్డు క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తయారుచేసిన ప్రత్యేక యూనిఫామ్ జాకెట్, డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, వాటర్ బోర్డు ఎండీ ఎం.దానకిషోర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Next Story