ఆరుగురిని కాపాడిన చీర

by  |
Cheera
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలు నవ వధువును బలితీసుకున్నాయి. వరద నీటిలో చిక్కుకుని నవ వధువు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ఎంఆర్ పల్లి వెస్ట్ చర్చి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ వాహనం నీట మునిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన సంధ్య అనే నవ వధువు మృతి చెందింది. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన సంధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి తుఫాను వాహనంలో వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. డ్రైవర్ వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా వాహనాన్ని ముందుకు నడిపించాడు. దీంతో వాహనం వరదల్లో చిక్కుకుంది. వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు వరదల్లో చిక్కుకున్నారు. ప్రయాణికుల్లో సంధ్య (30) అనే మహిళ ఊపిరాడక మరణించింది.

వరదలో చిక్కుకున్న వాహనం నుంచి ప్రయాణికులు కొంత మంది ఓ చీరను ఆసరా చేసుకుని బయటకు వచ్చారు. అయితే సంధ్యతో పాటు చిన్నారి కారులోనే చిక్కుకుపోయారు. దాంతో ఊపిరాడక సంధ్య మరణించింది. చిన్నారి మాత్రం ఆందోళకర పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భక్తులు ప్రయాణిస్తున్న వాహనం కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత వాహనం డ్రైవర్ పారిపోయినట్లు తెలుస్తోంది. ఎంఆర్ పల్లి వెస్ట్ చర్చి వద్ద రైల్వేఅండర్ బ్రిడ్జ్ చాలా ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి కూడా అది ప్రమాదకరంగా మారుతుందని ..ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. మరో ప్రాణం బలికాకుండా ఉండాలంటే అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed