టీఆర్‌ఎస్‌యేతర ఉమ్మడి అభ్యర్థిగా సర్దార్‌ రవీందర్ సింగ్..!

by  |
టీఆర్‌ఎస్‌యేతర ఉమ్మడి అభ్యర్థిగా సర్దార్‌ రవీందర్ సింగ్..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేక కూటమి అంతా మరోసారి జట్టు కట్టబోతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిచ్చేందుకు వ్యూహం రచించాయి. ఇందుకు టీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌ను ప్రత్యర్థి పార్టీలు అందివచ్చిన అవకాశంగా మల్చుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్‌లు అంతా కలిసి రవీందర్ సింగ్‌ను ఉమ్మడి అభ్యర్థిగా పరోక్షంగా ప్రకటించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రవీందర్ సింగ్‌తో కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు టచ్‌లో ఉండగా ఇండిపెండెంట్‌గా ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం ఆయనకు జై కొట్టాలని నిర్ణయించుకున్నారు.

10 మంది టచ్‌‌లో..

సర్దార్ రవీందర్ సింగ్‌తో ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేసిన అభ్యర్థులు 10 మంది వరకూ టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. వారికి అనుకూలంగా ఉన్న ఓటర్లను రవీందర్ సింగ్‌కు అనుకూలంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీనికి తోడు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్న స్థానిక నేతలు కూడా సర్దార్‌కు అనుకూలంగా ఉన్నామన్న సంకేతాలు పంపించినట్టు సమాచారం. దీంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే అన్నట్టుగా భావిస్తున్నారు. ఈ కారణంగానే రవీందర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.

ఫలించిన ఈటలాస్త్రాం…

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన వ్యూహానికి పదును పెట్టి చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ముంచనుందా అన్న చర్చ సాగుతోంది. సైలెంట్‌గా ఈటల వేసిన ఎత్తుగడతో మరో వ్యూహం ఫలించబోతున్నట్టుగా భావిస్తున్నారు. పైకి మాత్రం అంటీ ముట్టనట్టుగా ఉన్న ఈటల గ్రౌండ్ వర్క్ చాలా సీరియస్‌గా చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. రవీందర్ సింగ్‌తో తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగా పావులు కదుపుతున్నారని సమాచారం. ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో కొంతమంది ఈటల అంటే సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారందరినీ సింగ్‌కు అనుకూలంగా మల్చేందుకు సమీకరణాలు జరుపుతున్నట్టు సమాచారం. తన తొలి అడుగు సక్సెస్ కావాలన్న సంకల్పంతో ఉన్న ఈటల చాలా సీరియస్‌గా ఎత్తుగడలు వేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.



Next Story

Most Viewed