పంద్రాగస్టున విధుల్లో చేరిన సంతోషి

by  |
పంద్రాగస్టున విధుల్లో చేరిన సంతోషి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి పంద్రాగస్టు రోజున ప్రభుత్వ విధుల్లో చేరారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ అధికారిగా ఆమె తన జాయినింగ్ రిపోర్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు శనివారం అందజేశారు. అప్పటికే ఆమె సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కలిసి పంద్రాగస్టు రోజునే విధుల్లో చేరనున్నట్లు తెలియజేశారు.

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం స్వయంగా ఇంటికి వెళ్ళి కలిసి రూ.5కోట్ల నగదు సాయం, హైదరాబాద్‌లో ఇంటి స్థలం, కోరుకున్నశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం ఇప్పటికే కుటుంబానికి అందింది. ఇంటి స్థలాన్ని కూడా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో 711 గజాల మేర కేటాయించారు. ఇప్పుడు పంద్రాగస్టు రోజున ఆమె ప్రభుత్వ అధికారిగా విధుల్లో చేరారు. వాణిజ్య పన్నుల విభాగంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఆమె చేరనున్నారు. ఆమెకు తగిన శిక్షణ ఇప్పించి విధి నిర్వహణలో స్థిమితపడే వరకు చేదోడువాదుడుగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా స్మితా సభర్వాల్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించినందువల్ల సోమవారం నుంచి ఆమెకు శిక్షణ లభించనుంది.

Next Story

Most Viewed