కడపలో వింత ఆచారం.. మగ వాళ్లతో..

by  |
కడపలో వింత ఆచారం.. మగ వాళ్లతో..
X

దిశ, ఏపీ బ్యూరో: ఎక్కడైనా మహిళలు దేవుళ్లు, దేవతలకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకోవడం సర్వసాధారణం. కానీ, కడప జిల్లాలో మాత్రం మగవాళ్లే పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక ఆచారాన్ని చాటుతున్నారు. పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మగవాళ్ల పొంగళ్లను ఘనంగా జరుపుకొంటున్నారు. ప్రతి ఏడాదీ సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం సంజీవరాయునికి పొంగళ్లు పెడతారు. సంక్రాంతి కంటే పొంగళ్లు పండుగనే గ్రామస్తులు ఘనంగా జరుపుకుంటారు. ఆ గ్రామానికి చెందిన వారు దేశవిదేశాల్లో ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్టించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.

కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఓ బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండేవాడని, పురుషులతో తప్ప స్త్రీలతో మాట్లాడేవాడు కాదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన వెళ్తూ గ్రామంలో ఓ శిలను నాటి దానిపై లిపిని రాశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామికి మగవారే పొంగళ్లు పెట్టాలని చెప్పినట్టు అక్కడ నానుడి. అప్పటినుంచి ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నట్లు చెబుతున్నారు. మహిళలు ఆలయంలోకి రాకుండా వెలుపల నుంచే స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి పెట్టిన నైవేధ్యాన్ని కూడా మగవాళ్లే తినాలి. మహిళలు ముట్టుకోరు. ఏమైనా ఇదో వింతే మరి.


Next Story

Most Viewed