కరోనా కేసులు పెరగడానికి కారణం ఇదే..!

by  |
కరోనా కేసులు పెరగడానికి కారణం ఇదే..!
X

దిశ ఏపీ బ్యూరో :
ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులుగా భారీ ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుదలకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని బస్సులని అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇంద్ర బస్సులను కరోనా టెస్టింగ్ ల్యాబులుగా అభివృద్ధి చేసి కరోనా ప్రభావం చూపుతున్న జిల్లాలకు పంపింది. ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. సంజీవని బస్సుల్లో కరోనా టెస్టుల ఫలితాలు వేగంగా వస్తుండటంతో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఈ నెల 12వ తేదీ నాటికి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29, 168 అయితే, అందులో యాక్టివ్ కేసులు 13వేలకు పైగా ఉంటే డిశ్చార్జ్‌లు 15 వేల పైచిలుకు ఉండేవి. ఈ క్రమంలో సంజీవని బస్సులు కరోనా నిర్ధారణ టెస్టుల రంగంలోకి దిగాయి. దీంతో ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. నేడు ఈ సంఖ్య 4,713 కరోనా పాజిటివ్ కేసులకు చేరింది. ఇందులో 31,763 యాక్టివ్ కేసులు ఉంటే.. 32,127 కేసులు కోలుకుని డిశ్చార్జ్ అయినవి. ఈ లెక్కన కేవలం పది రోజుల్లోనే మూడు నెలల్లో వచ్చిన కేసుల కంటే రెట్టింపు కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో ఏపీలో కరోనా మృతుల సంఖ్యకూడా పెరిగింది. 12 నాటికి ఏపీలో కరోనా కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 328 అయితే కేవలం పది రోజుల్లోనే ఇది రెట్టింపైంది. నేటికి ఈ సంఖ్య 823కి చేరుకుంది. దీనిపై కరోనా బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తీవ్రమైన మహమ్మారి అని, బాధితులకు చికిత్స అందించేవారు కూడా కరోనా బారిన పడటంతో వైద్యులు కూడా బాధితులకు చికిత్స అందించేందుకు వెనకాడుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రుల్లో సేవలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొద్దీ వెంటిలేటర్‌పై చికిత్స చేయాలంటే మరింత కష్టంగా మారుతుందని, కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల్లో పని చేసేందుకు సిబ్బంది కూడా ఆసక్తి చూపడం లేదని కరోనా నుంచి కోలుకున్న వారు చెబుతున్నారు.

శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే పరిస్థితి క్లిష్టంగా మారుతోందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. వయసు పైబడ్డ వారి విషయంలోనే సమస్యలు ఎదురవుతున్నాయని, ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా బాధితులను కూడా తీవ్రత, లక్షణాల ఆధారంగా నాలుగు వర్గాలుగా విభజించి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. ప్రతి క్వారంటైన్ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వైద్య సేవలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో ఇవి నడుస్తున్నాయని చెబుతున్నారు.

ఏపీలో గత పది రోజుల్లో పాజిటివ్ కేసులు రెట్టింపు అవడం వెనుక కారణం సంజీవని బస్సులని వారు వెల్లడించారు. సంజీవని బస్సుల్లో టెస్టుల రిజల్ట్స్ వేగంగా వస్తున్నాయని, భారీ సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తుండడంతోనే కేసులు పెరుగుతున్నాయని జిల్లాల అధికారులు వివరణ ఇస్తున్నారు. దీనికి ఉదాహరణగా.. పది రోజుల క్రితం 15 వేలకు పైగా టెస్టులు జరిగేవని, ఇప్పుడవి 37వేలకు పైగా జరుగుతున్నాయని చెప్పారు. రెట్టింపు పరీక్షలు జరుగుతున్న కారణంగా కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయని తెలిపారు.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల సేవలు తీసుకుంటోందని చెప్పారు. కరోనా వైరస్ సొకిందని తెలిస్తే వాలంటీర్లు ముందుగా ఆప్రాంత వాసుల్లో కరోనా పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారని, తద్వారా కరోనా పెద్ద సంఖ్యలో సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

Next Story