ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది: జగ్గారెడ్డి

by  |
ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది: జగ్గారెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో: మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో స్పీక్ అప్ తెలంగాణ పేరుతో కొవిడ్-19పై డిజిటల్ ఉద్యమం చేపట్టామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, పేదలకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫీజులను నియంత్రించి, యాభై శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాకేంద్రాల్లోని హోటళ్లలో 50శాతం రూమ్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వాటిని హోమ్ క్వారంటైన్‌లుగా మార్చాలన్నారు. కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు రూ. 50లక్షలు పరిహారంగా ఇవ్వాలన్నారు.

గుండెపోటు వంటి ఇబ్బందులతో ఆస్పత్రికి వెళ్లినా కరోనా అనుమానంతో వైద్యం చేయడం లేదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో కరోనాయేతర ఆరోగ్య సమస్యలతో వెళుతున్న వారికి సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నారని అన్నారు. కరోనాకు మందు వచ్చే వరకు ప్రజలకు విద్యుత్ బిల్లులు రద్దు చేసి, ఇంటి కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి పన్నులు పూర్తిగా రద్దు చేయాలని, గాంధీ హాస్పిటల్‌కు రూ. 3వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రజలంతా మరణిస్తే ప్రాజెక్టులు కట్టినా ఉపయోగం లేదని, ఇప్పుడు ప్రజల ప్రాణాలు ముఖ్యమని జగ్గారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.



Next Story

Most Viewed