బ్లాక్ ఫంగస్ @వణుకుతున్న పల్లెలు.. కన్నుపోగొట్టుకున్న సమ్మయ్య!

by  |
బ్లాక్ ఫంగస్ @వణుకుతున్న పల్లెలు.. కన్నుపోగొట్టుకున్న సమ్మయ్య!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు అతనిది. మాయదారి రోగం ఆ పేదోడి జీవితంతో చెలగాటమాడుతోంది. బతికి బట్ట కట్టాడన్న సంతోషం కన్నా రోజు వారి మందులు కొనుగోలు చేయలేక తల్లిడిల్లిపోతోంది ఆ కుటుంబం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లికి చెందిన వావిలాల సమ్మయ్య(42) కు దాదాపు నెల రోజుల కింద కరోనా సోకింది. క్వారంటైన్‌లో ఉండి కోలుకున్న సమ్మయ్యకు తిరిగి తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో వరంగల్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

ఆ తర్వాత సమ్మయ్యకు కంటి సంబంధిత వ్యాధి సోకడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా బ్లాక్ ఫంగస్ అని డాక్టర్లు నిర్దారించారు. ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉందని చెప్పిన డాక్టర్లు కన్ను తీసేయాలని స్పష్టంచేశారు. కన్ను తీసేసేందుకు రూ.15 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో తనకున్న మూడెకరాల భూమిని తాకట్టు పెట్టి అప్పు చేశాడు. బ్లాక్ ఫంగస్ సోకిన కన్ను తీసేసిన తరువాత కొద్ది రోజుల పాటు మందులు వాడాలని డాక్టర్లు సూచించారు.

రోజుకు రూ. 60 వేల మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉన్న కొద్దిపాటి భూమి తాకట్టు పెట్టడంతో కూలీ నాలీ చేసుకుని జీవించే సమ్మయ్య కుటుంబం మందులు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పూట గడవడమే కష్టంగా మారిన బాధిత కుటుంబానికి రోజువారి మందులు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన సమ్మయ్యను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. సాయం చేసే వారు గూగుల్ పే నెంబర్ 8008240915 ద్వారా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. మారుమూల అంబట్ పల్లి గ్రామానికి చెందిన సమ్మయ్యకు ఆపన్న హస్తం అందించాలని గ్రామస్థులు అభ్యర్థిస్తున్నారు.

Next Story

Most Viewed