సమగ్ర కుటుంబ సర్వే పెద్ద కుట్ర : రేవంత్ రెడ్డి

by  |
Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పెద్ద కుట్ర అని, ఇంత వరకు ఎందుకు సర్వే వివరాలు బయటపెట్టలేదని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్​చేశారు. ఇందిరాభవన్‌ కాంగ్రెస్​పార్టీ ఓబీసీ సెల్​ఆధ్వర్యంలో బీసీ జనగణన అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్​రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో వచ్చేది కాంగ్రెస్​ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎలా న్యాయం చేయాలనే యాక్షన్​ప్లాన్​ రూపొందిస్తామన్నారు.

బీసీ వర్గాల కోసం ఎంతో చేస్తున్నట్లు చెప్పుకునే కేసీఆర్​సర్కారు ఏడేండ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీ సంఘాలు చేసే అన్ని ఉద్యమాలకు కాంగ్రెస్​మద్దతు ఉంటుందని రేవంత్​రెడ్డి ప్రకటించారు. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన జరగాలని, మోడీ వన్ నేషన్ వన్ సెన్సెక్స్‌ను ఎందుకు తీసురావడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం కులగణన చేయకపోవడంలో మతలబు ఏమిటన్నారు. కుల గణన చేస్తేనే రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందని, బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరని, బీసీలు కులగణన కోరడంలో న్యాయముందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు.

టీజేఎస్​అధ్యక్షుడు కోదండరామ్​మాట్లాడుతూ దేశంలో కులం అనేది కీలకంగా మారిందని, కుల గణన జరిగితేనే బీసీల సంఖ్య తేలుతుందన్నారు. దీనిపై అసెంబ్లీ తీర్మానం చేయడం మంచి పరిణామమని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు బయటపెట్టాలన్నారు. అయితే అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదని, ఉమ్మడిగా పోరాటం చేయాలని, రాష్ట్రపతికి లేఖ రాయాలని, సంతకాల సేకరణ, పోస్టు కార్డుల ఉద్యమం చేయాలని కోదండరామ్​ పిలుపునిచ్చారు.

ప్రొఫెసర్​ మురళీమనోహర్​ మాట్లాడుతూ కుల నిర్మూలన జరగాలంటే గణన జరగొద్దని అంబేద్కర్​ అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఓబీసీ కులాలు కనీసం మనుషులుగా బతికే పరిస్థితి లేదన్నారు. బంగారు తెలంగాణ వస్తుందని అంతా నమ్మి పోరాటాలు చేశారని, కానీ స్వరాష్ట్రంలో బీసీ కులాలు అభివృద్ధి కాలేదన్నారు.

టీపీసీసీ ఓబీసీ సెల్​ చైర్మన్​ నూతి శ్రీకాంత్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​కుమార్ గౌడ్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్లు తిరుమలి, విశ్వేశ్వర్, పీఓడబ్ల్యూ సంధ్య, సీపీఐ బాల మల్లేష్, సీపీఎం రమణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed