ప్రైవేట్ ఉద్యోగుల్లో జీతాల టెన్షన్ !

by  |
ప్రైవేట్ ఉద్యోగుల్లో జీతాల టెన్షన్ !
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో సోమవారం రాత్రి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని డిసైడ్ అయ్యారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, ప్రజా ప్రతినిధుల జీతాల్లో 75శాతం, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల వేతనాల్లో 60శాతం, మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఎంప్లాయిస్ శాలరీల్లో 50శాతం, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10శాతం, పెన్షనర్లకు 50 శాతం కోత విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రానికి రావల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తూ, కుటుంబాన్ని పోషించుకునే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాల్సిన పరిస్థితి రావడాన్ని కొందరు స్వాగతించి, మరికొందరు వ్యతిరేకించినా ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అయిపోయింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి విశ్రాంత పెన్షన్లు తీసుకునే వారికి సైతం జీతాల్లో కోత పడటంతో విషయం తెలుసుకున్న ప్రైవేట్ ఉద్యోగులు టెన్షన్‌కు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు కోత పెడుతున్న పరిస్థితులు రావడంతో ఇక తమ పరిస్థితి ఏంటని పునరాలోచనలో పడిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవంతో మార్చి 15 నుంచి చాలా ఐటీ కంపెనీల నుంచి, ఇతర సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆదాయమే కాకుండా ప్రైవేట్ కంపెనీలకు సైతం ఆదాయం మొత్తం తగ్గిపోయింది. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు తగ్గించి ఇస్తుండటంతో దీన్ని బూచీగా చూపించి ప్రైవేట్ కంపెనీలు తమకు శాలరీస్ అకౌంట్లో వేస్తాయా లేదా అన్న భయంతో మథనపడిపోతున్నారు.

అయితే ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు మార్చి 1 నుంచి 21 వరకు పూర్తిస్థాయిలోనే డ్యూటీలు చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి మొత్తం కంపెనీలు షట్ డౌన్ పాటించగా, హెల్త్‌, పోలీసు విభాగాలు, సూపర్ మార్కెట్లు, ఇతర అత్యవసర వ్యవస్థలు నడుస్తున్నాయి. దాదాపు 22 రోజుల వరకు పూర్తిస్థాయిలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనే కోత విధిస్తుండటంతో ప్రైవేట్ కంపెనీలు ఎలాంటి దిశగా నిర్ణయం తీసుకొని ఏ విధంగా జీతాలు ఇస్తాయోనని భయపడిపోతున్నారు. లాక్‌‌డౌన్‌తో ఇంట్లో ఉండటంతో నిత్యావసర సరుకులకే మొత్తం డబ్బులు ఖర్చుకాగా, ఇప్పుడు తమ ఆఫీస్‌ నుంచి తక్కువ జీతం పడితే ఏప్రిల్ నెల మొత్తం ఎలా నెట్టుకురావాలని కుంగిపోతున్నారు. దీనికి తోడు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుండగా, తర్వాత పరిస్థితుల్లో కూడా ఇలాగే కొనసాగితే ఏప్రిల్ నెల జీతంపై ఆలోచనలు చేస్తూ మే నెలలో ఎలా జీవితాన్ని నెట్టుకురావాలని టెన్షన్ పడిపోతున్నారు.

Tags: Corona effect, Government, employees, salaries, private employees, tension, lockdown, CM KCR, Police



Next Story