నో శాలరీ.. ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూపు

by  |
నో శాలరీ.. ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​, సెర్ప్​ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రోజుకో రెండు జిల్లాల చొప్పున సర్దుబాటు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా భావించే బతుకమ్మ మొదలుకావడంతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంటోంది. మరోవైపు నాల్గొ తరగతి ఉద్యోగులకు ఈ నెల 14 వరకు వేతనాలు జమ అయ్యే అవకాశాలున్నాయి. గత నెల వరకూ వారికి 15వ తేదీ వరకు వేతనాలు జమ చేస్తున్నారు. ఈ నెల కూడా అదే సమయంలో ఇస్తామంటూ ట్రెజరీల్లో చెప్పుతున్నారు. దీంతో పండుగకు ఎలా అనే ఆందోళన మొదలైంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైందంటూనే జీతాలను ఆలస్యం చేస్తున్నారు. దాదాపు ఆరు నెలల నుంచి వేతనాలను జిల్లాల వారీగా ఇస్తున్నారు. ఇప్పుడు పండుగల సమయంలో కూడా అదే అమలు చేస్తామని ఉన్నతాధికారులు చెప్పుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే బ్యాంకుల్లో వేతనాల చెక్కులను జమ చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకో రెండు, మూడు జిల్లాల వారీగానే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా 16 జిల్లాల్లో వేతనాలు ఇవ్వాల్సి ఉండగా.. గురువారం మరో రెండు, మూడు జిల్లాలకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇలా పూర్తిస్థాయిలో ఇవ్వాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

పీఆర్సీ లేదు

ప్రభుత్వ రెగ్యులర్​ ఉద్యోగులకు మినహా.. కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​తో పాటు హోంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్​వాడీలకు పెరిగిన వేతనాలు అందడం లేదు. పాత వేతనాలనే విడుదల చేస్తున్నారు. పెరిగిన వేతనాలకు సరిపడ నిధులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో పాత వేతనాలను ఇస్తున్నట్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు వెల్లడించారు. వేతనాల పెంపుపై జీవోలు జారీ చేసినప్పటికీ.. ఫైనాన్స్​ నుంచి అప్రూవల్​ జారీ చేయడం లేదు. దీంతో ఆయా వర్గాలకు ఈ పండుగకు కూడా పాత వేతనాలే జమ అవుతున్నాయి. దీని ప్రకారం ఐదు నెలల ఏరియర్స్​ ఉద్యోగులకు రావాల్సి ఉంటోంది.


Next Story

Most Viewed