తేజ్ ‘సీడ్ గణేష్‌’కు ప్రశంసలు..

by  |
తేజ్ ‘సీడ్ గణేష్‌’కు ప్రశంసలు..
X

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఊరు ఊరంతా సందడే సందడి. డీజేలు, సౌండ్ బాక్స్‌లు, డ్యాన్సులు, అప్పుడప్పుడు విఘ్నేశ్వరుడికి పూజలు. ఒకప్పుడు ఊరి మొత్తానికి ఒకే వినాయకుడిని నిలబెడితే ఇప్పుడు వీధికో వినాయకుడి మండపం వెలుస్తోంది. దీంతో చెరువులో విగ్రహాల నిమజ్జనం ఇబ్బంది అవుతుంది. అంతేకాదు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ రసాయనాల కారణంగా నీటి కాలుష్యం జరగడంతో పాటు నీటిలోని జీవచరాలు చనిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్ ఓ గొప్ప దైవ కార్యానికి శ్రీకారం చుట్టాడు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆడంబరాలకు పోయి ప్రజలు ప్రకృతిని నాశనం చేస్తున్న వేళ.. వారిలో అవగాహన కల్పిస్తూ సరికొత్త గణేషుడిని భక్తితో ఆరాధించాలని పిలుపునిస్తున్నారు. మట్టితో తయారు చేసిన సీడ్ గణేశునికి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి ఇంట్లోనే ఓ కుండీలో నిమజ్జనం చేయాలని కోరుతున్నారు.

ఇలా చేయడం వల్ల విఘ్నేశుని నిమజ్జనం నిర్విఘ్నంగా జరగడంతో పాటు ఆ సీడ్ గణేశునిలో నిక్షిప్తమైన విత్తనాలు అదే మట్టిలో మొక్కలుగా ఎదుగుతాయి. తద్వారా ప్రతీఏట వినాయక నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న కాలుష్యానికి చెక్‌పెట్టి.. ప్రకృతికి మరింత పచ్చదనాన్ని జతచేసే అవకాశం ఉంది. ‘గ్రీన్ వేవ్స్’ సంస్థ తయారుచేసిన సీడ్ గణేష్‌తో ఈ పండగను ఘనంగా జరుపుకోవాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాడు తేజ్.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులకు సీడ్ గణేష్‌ను ఇంటికి పంపించి మరింత మందికి అవగాహన కల్పించాలని కోరుతున్నాడు తేజ్. కాగా తేజ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రశంసలు అందుతున్నాయి.

Next Story