సాగర్‌లో వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు

by  |
సాగర్‌లో వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్​ అభ్యర్థి గెలుపుపై ఆ పార్టీ జబ్బలు చరుచుకోవడం విచిత్రంగా ఉందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సాగర్​నియోజకవర్గంలో 1.89 లక్షల ఓట్లు ఉంటే అందులో దాదాపు లక్షమంది టీఆర్ఎస్‌ను వద్దనుకున్నట్లు రుజువైందని, ఈ గెలుపు కోసం ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ రూ. 100 కోట్లకుపైగా ఖర్చు పెట్టి ఓటర్లను ఒత్తిడికి గురి చేశారని ఆరోపించారు.

మరోవైపు కాంగ్రెస్ నుంచి పార్టీ కంటే మిన్నగా ఆ పార్టీ సీనియర్ నేతగా, సెగ్మెంట్​కు ఎంతో సేవ చేశారంటూ జానారెడ్డి కేంద్రంగా బలమైన ప్రచారం చేసుకున్నా ఓడిపోయారని, ఈ లెక్కన తెలంగాణ ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్‌ని వద్దనుకున్నట్టు ఓటు ద్వారా చెప్పకనే చెప్పారన్నారు. ఇక బీజేపీ గెలవకపోవడంలో సాగర్ ఉపఎన్నిక అత్యంత ప్రత్యేక పరిస్థితులలో జరిగిందని, సానుభూతి పవనాలు కూడా ప్రభావితం చేశాయనే విషయాన్ని మర్చిపోకూడదని విజయశాంతి సూచించారు.

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, దీన్ని ప్రకారం వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి ప్రత్యామ్నాయం కమల దళమేనన్న సంకేతాలు వెలువడ్డాయన్నారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే అస్సాంలో బీజేపీకి మరోసారి ప్రజామోదం వచ్చిందని, పుదుచ్చేరిలో తొలిసారి అధికార పగ్గాలు ఎన్డీయేకే దక్కనున్నాయని, తమిళనాడులో డీఎంకే క్లీన్ స్వీప్ అనే అంచనాలను బీజేపీ-ఏడీఎంకే కూటమి నిలువరించిందన్నారు.

బెంగాల్‌లో కేవలం మూడు స్థానాల నుంచి 80 సీట్ల స్థాయికి బీజేపీ చేరిందని, కేరళ ఫలితాలు ఆశాజనకంగా లేకపోయినా అక్కడ వచ్చిన ఓట్ల శాతం కచ్చితంగా బీజేపీకి మంచి భవిష్యత్తును సూచిస్తోందన్నారు. దీని ప్రకారం కమల వికాసంపై దేశ ప్రజల విశ్వాసం మరింత బలోపేతమవుతున్నట్లేనని విజయశాంతి వివరించారు.

Next Story

Most Viewed