సైబర్ భద్రత మీ చేతుల్లోనే!

by  |
సైబర్ భద్రత మీ చేతుల్లోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాను ఉపయోగించడానికి వయోపరిమితి ఉన్నా దాన్ని పట్టించుకోరు. పుట్టగానే బిడ్డలకు ఫేస్‌బుక్ ఖాతా క్రియేట్ చేస్తున్న మహానుభావులు కూడా ఉన్నారు. కానీ వారు ఎదుగుతున్న కొద్దీ ‘సైబర్ బుల్లీయింగ్’ అనే ఒక విషమ పరిస్థితిని ఎదుర్కొంటారని గ్రహించలేకపోతున్నారు. ముందు అలవాటు చేసి, తర్వాత సమస్యల్లో పడటం కంటే నిర్దిష్ట వయస్సు వచ్చేవరకు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు లేకుండా చూడటమే ఉత్తమం. పరిచయం లేని వ్యక్తులు తప్పుడు పేర్లతో మాయమాటలు చెప్పి, పిల్లలను గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే పిల్లల్నే టార్గెట్ చేస్తూ వాళ్లను వేధించే బ్యాచ్‌లు కూడా ఉంటాయి. ఇలాంటి వారి బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు. అందుకే వారికి సోషల్ మీడియా గురించి నేర్పించేటపుడు సైబర్ భద్రత గురించి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఇటీవల పిల్లల శాంతి బహుమతి గెలుచుకున్న బంగ్లాదేశ్‌కు చెందిన 17 ఏళ్ల సదత్ రహమాన్‌ను నిదర్శనంగా చూపించవచ్చు.

‘సైబర్ బుల్లీయింగ్’ కారణంగా ఓ పదిహేనేళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో సదత్ రహమాన్ సైబర్ భద్రత గురించి తన వయస్సు వారికి అవగాహన కల్పించే ప్రచారాన్ని మొదలుపెట్టాడు. అంతేకాకుండా సైబర్ బుల్లీయింగ్‌ను ఆపడానికి ‘సైబర్ టీన్స్’ అనే యాప్‌ను కూడా రూపొందించాడు. ఈ యాప్ ద్వారా సైబర్ బుల్లీయింగ్‌ బారిన పడిన టీనేజర్లకు వారి బాధను ఒకరితో ఒకరు పంచుకునే అవకాశాన్ని కల్పించాడు. ఇప్పటి వరకు 300 మంది బాధితులు ఈ యాప్ ద్వారా మామూలు స్థితికి రాగలిగారు. అంతేకాకుండా 45 వేల మంది టీనేజర్లకు ఈ యాప్ చేరువైంది. ఎనిమిది మంది సైబర్ నేరగాళ్లను ఈ యాప్ పోలీసులకు పట్టించింది. ఇవన్నీ చూస్తుంటే మన దగ్గర కూడా పిల్లలు సైబర్ బుల్లీయింగ్ వల్ల బాధపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియా వాడకానికి ముందుగా వారికి సైబర్ భద్రత పాఠాలు నేర్పించాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది.!



Next Story

Most Viewed