క్రికెట్ దేవుడికి శుభాకాంక్షల వెల్లువ..

by  |
క్రికెట్ దేవుడికి శుభాకాంక్షల వెల్లువ..
X

దిశ, స్పోర్ట్స్: అది 1994.. ఎనిమిదో తరగతి చదువుతున్న సురేష్.. క్వార్టర్లీ పరీక్ష రాసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి ఎవరినీ పలకరించకుండా హడావిడిగా ఇంటికి చేరుకున్నాడు. రావడం రావడమే అడిగిన ఒకే ఒక ప్రశ్న.. సచిన్ ఉన్నాడా ? స్కోరెంత..? పదేళ్ల తర్వాత పీజీ పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగి ఇంటికి చేరుకున్న సురేష్ అడిగిన ప్రశ్న.. సచిన్ ఎంత కొట్టాడు ? మరో ఐదేళ్ల తర్వాత ఉద్యోగం చేస్తున్న సురేష్.. ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తూనే.. నిమిషానికోసారి తన స్మార్ట్ ఫోన్లో సచిన్ ఎలా ఆడుతున్నాడా అని ఎప్పటికప్పుడు స్కోర్ చూస్తున్నాడు. సచిన్ అవుటైతే తనే అవుటైనంత బాధపడిపోయాడు. ఇలాంటి సురేష్‌లు ప్రతీ ఇంట్లో ఉండేవారు. ఒక తరం అంతా సచిన్‌ కెరీర్‌తో పాటే పెరిగింది.

ఇండియాలో క్రికెట్‌ను ఇంతలా ఆరాధిస్తున్నారంటే.. అందులో క్రికెట్ దేవుడు సచిన్ పాత్ర ఎంతో ఉంది. సచిన్‌ కంటే ముందు భారత్‌లో దిగ్గజ క్రికెటర్లు లేరా అంటే.. ఎందుకు లేరు ? కపిల్, గవాస్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజ క్రికెటర్లూ ఉన్నారు. సచిన్‌తో పాటే కెరీర్ కొనసాగించిన అజాహరుద్దీన్, వీవీఎస్, గంగూలీ, ద్రవిడ్, శ్రీనాథ్, కుంబ్లే వరల్డ్ క్లాస్ క్రికెటర్లు కూడా భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేశారు. ఆ తర్వాత ధోనీ, సెహ్వాగ్, యువరాజ్, గంభీర్, కోహ్లీ వంటి టాలెంటెడ్ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. కానీ సచిన్‌ను మించిపోయాడురా అని అనిపించుకున్న వాళ్లు ఒక్కరూ లేరు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. ఇవాళ (ఏప్రిల్ 24) లెజెండరీ క్రికెటర్ సచిన్ పుట్టిన రోజు. తన 16వ ఏటనే క్రికెట్‌లోకి అడుగుపెట్టి, ఎన్నో రికార్డులను తిరగరాసిన సచిన్ 2013 నవంబర్ 16న క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. కానీ ఇప్పటికీ సచిన్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సచిన్ లేకున్నా.. అతడి వారసులున్నారు. ఇండియన్ క్రికెట్‌ను ఆకాశమంత ఎత్తుకు చేర్చారు. తాము చిన్నతనంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణనిచ్చిన సచిన్ టెండూల్కర్‌ 47వ పుట్టినరోజును పురస్కరించుకొని అతడికి శుభాకాంక్షల తెలియజేస్తున్నారు.

క్రికెట్ ఆడకపోయినా ప్రతీ ఏడాది ఈ సమయంలో ఐపీఎల్‌తో బిజీబిజీగా ఉండేవాడు సచిన్. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. చెట్లకు నీళ్లు పోస్తూ, వంట చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నట్లు సచిన్ వెల్లడించాడు. కాగా, సచిన్ పుట్టిన రోజు సందర్భంగా తోటి క్రికెటర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులతో పాటు ఐసీసీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. సచిన్ ముంబై దాడుల బాధితులకు అంకితం ఇచ్చిన తన 41వ సెంచరీ వీడియోను పోస్టు చేసి బీసీసీఐ శుభాకాంక్షలు చెప్పింది. తెలంగాణ మంత్రి కేటీఆర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, వీవీఎస్ లక్ష్మణ్, బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీ, మహ్మద్ కైఫ్ ఇతర టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సచిన్ 1989 నవంబర్ 15న పాకిస్తాన్‌తో తొలి టెస్టు ఆడగా.. 2013 నవంబర్ 14న చివరి టెస్టు వెస్టిండీస్ మీద ఆడాడు. సచిన్ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు, 463 వన్డేలు, 310 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 248 కాగా, వన్డేల్లో అత్యధిక స్కోర్ 200 పరుగులు. టెస్టుల్లో 15,921 పరుగులు 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు, 46 వికెట్లతో పాటు వన్డేల్లో 18,426 పరుగులు 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు.

Tags :Cricket God, Birthday, KTR, Wishes, Former cricketers, Legendary cricketer


Next Story

Most Viewed