బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో విద్యా సంస్థలు బంద్

by  |
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో విద్యా సంస్థలు బంద్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. విద్యాసంస్థలను టార్గెట్ చేసి మహామ్మరి పంజా విసురుతోంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులపై దాడి చేస్తొంది. దీంతో రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీల్లో రోజుకు వందలాది కేసులు నమోదవుతున్నాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్​ బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తోపాటు కాలేజీలను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రేటర్ లో విద్యాసంస్థలన్నీ నేటి నుంచి ముతపడనున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత డిసెంబర్ నుంచి గ్రేటర్ లో స్కూళ్లు తెరుచుకోవడంతో సామూహికంగా విద్యాబోధన నడుస్తోంది. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు మెల్లమెల్లగా సడిలిస్తూ వచ్చింది. విద్యార్థులు ఒకే చోట గూమికూడుతున్నారు. కరోనా నిబంధనలు పాటించడం సాధ్యపడడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లోని వేలాది స్కూల్స్​లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు దీంతో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల ద్వారా వారి కుటుంబసభ్యులు, ఆ తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మంగళవారం శాసన సభలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నెల 24 నుంచి స్కూల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్ గడ్​ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసి వేసినట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కళాశాలలు మినహా హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

గతేడాది మర్చి 31 నుంచి బంద్

కరోనా వైరస్​తో గతేడాది 2020, మార్చి 31వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి మూతపడిన స్కూళ్లు కరోనా కొంత మేరకు తగ్గుముఖం పట్టడడంతో డిసెంబర్ నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ముందుగా 9,10 తరగతులకు మాత్రమే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత 6 ,7,8వ తరగతులకు అనుమతి ఇచ్చింది. ఏడాదిగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కరోనా మహమ్మరి మరోసారి తన ప్రతాపాన్ని చూపెడుతోంది. ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు కాస్త గాడిలో పడుతూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగా, వారిలో 400 మందికి పైగా గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి సాధరణంగా అధికంగా ఉంటుంది. వీరికి కరోనా సోకిన పాజిటివ్ లక్షణాలు త్వరగా బయట పడవు. వీరు తరగతులకు హాజరై ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రజలు, కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించడగానికి కారణమవుతారని అభిప్రాయపడుతున్నారు.

దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ప్రభుత్వానికి ఈ విషయమై నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా విద్యాసంస్థలు కొనసాగితే కరోనాను కట్టడి చేయలేమని చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం స్కూళ్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది ఇంటర్ పరీక్షలు మాత్రమే సజావుగా నడిచాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యాసంస్థలను మూసివేసే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం కేసీఆర్ ఆదేశాలతో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు

Next Story

Most Viewed