వీఎం హోం కబ్జా..‘కరోనా’!

by  |
వీఎం హోం కబ్జా..‘కరోనా’!
X

దిశ, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనాథ పిల్లలకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. ప్రధాన రహదారిపై ఉన్న రైతుబజార్‌ను విక్టోరియా మెమోరియల్ హోం ఆవరణలోకి తరలించారు. దీంతో అక్కడి నిరాశ్రయుల్లో భయాందోళన పట్టుకుంది. ముందస్తుగా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే బజార్ ఏర్పాటు సరికాదంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. వెంటనే మెమోరియల్ హోం నుంచి రైతు బజార్‌ను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

సామాజిక దూరం పేరుతో..

కరోనా నివారణ సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం) పాటించడంతోనే సాధ్యమని ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ఇందుకు కొన్ని నిబంధనలు విధించింది. వాటికి అనుగుణంగా ప్రజలు తమ నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం మాత్రమే రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒక వ్యక్తికి మరో వ్యక్తికి కనీసం మూడడుగుల (మీటరు‌) దూరాన్ని పాటించాలనే నిబంధన ఉంది. దిల్‌షుక్ నగర్ నుంచి ఎల్బీనగర్ ప్రధాన రహదారిలో ఉన్న సరూర్ నగర్ రైతు బజార్ ఆవరణ చాలా ఇరుకుగా ఉంది. దీంతో ఈ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు ఒకరి మరొకరి మధ్య కనీస దూరం పాటించడం ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల దృష్ట్యా సరూర్ నగర్ రైతుబజార్‌ను ఎదురుగా నున్న వీఎం హోమ్ ఆవరణలోకి మార్చాలని కొందరు స్థానిక రాజకీయ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో మార్కెట్‌ను వీఎం హోమ్ ఆవరణలోకి మార్చారు.

విక్టోరియా మెమోరియల్ హోం వందేళ్ల నుంచి అనాథలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ హోంలో సుమారు 1,000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా అనాథలు కావడంతో విద్యార్థులు రెసిడెన్సియల్ పద్ధతిలో విద్యనభ్యసిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రైతుబజార్ హోం ఆవరణలోనే ఉన్నందున, హోమ్ ప్రధాన గేటు నుంచి రైతు బజార్‌కు వందలు, వేల మంది లోపలికి వస్తున్నందున కరోనా వైరస్ వ్యాప్తి అవుతుందేమోనని అనాథలు ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా ఎక్కువ మంది రైతు బజార్‌కు పాఠశాల మెయిన్ గేటు నుంచి వస్తారనీ, అలా రావడానికి అధికారులు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కరోనా వైరస్ వ్యాప్తి జరిగితే అనాథల పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. హోం ఆవరణలో రైతుబజార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా పేరుతో కబ్జాకు యత్నం..?

కరోనా పేరుతో వీఎం హోం భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములు ప్రభుత్వానికి కాకపోవడంతో అనాథ పిల్లల విద్యావసరాలకు మాత్రమే వినియోగించాలని గతంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయిస్తూ విడుదల చేసిన జీవోను హైకోర్టు కొట్టి వేసింది. ఆ స్థలంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు‌కు ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి. లాక్ డౌన్ అయిపోగానే హోం భూములలో ఏర్పాటు చేసిన మార్కెట్ ఖాళీ చేయకపోతే వేలాది మంది అనాథ పిల్లల భవిష్యత్తు ఏంటని వీఎం హోం పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ భీమగాని మహేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే హోం ప్రహరీ గోడలు కూలగొట్టి , జేసీబీలతో పని చేస్తున్నారనీ, కరోనా పేరుతో భూముల అన్యాక్రాంతం చేస్తే ఎలా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్కెట్‌కు తొర్రూర్‌లో భూములు కేటాయించిన తర్వాత వీఎం హోం ఆవరణలో ఏర్పాటు ఎందుకని అడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే వీఎం హోమ్ ఆవరణలో రైతు బజార్‌ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: victoria memorial home, occupied by, rythu bazar, saroornagar, covid 19 effect

Next Story