ఈ నెల 23న భారత్, చైనా, రష్యాల త్రైపాక్షిక సమావేశం

by  |
ఈ నెల 23న భారత్, చైనా, రష్యాల త్రైపాక్షిక సమావేశం
X

న్యూఢిల్లీ: ఈ నెల 23న (రేపు) భారత్, చైనా, రష్యాల మధ్య త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఇందులో మూడు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు పాల్గొనబోతున్నారు. మనదేశం నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొనబోతున్నారు. చైనా సరిహద్దులో ఘర్షణలు కొనసాగడం, 15న 20 మంది భారత జవాన్లు అమరులవడంతో డ్రాగన్ దేశం పాల్గొనబోతున్న ఈ సమావేశానికి మనదేశం పచ్చజెండా ఊపుతుందా? లేదా? అన్న చర్చ నడిచింది. కానీ, భారత్ తరఫున కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొనబోతున్నట్టు ప్రభుత్వం ఖరారు చేసింది. 23వ తేదీన ఈ మూడు దేశాల మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం కాబోతున్నట్టు రష్యా ప్రకటించింది. భారత్, చైనాలతో సన్నిహితంగా ఉండే రష్యా, ఈ ఇరుదేశాల మధ్య ఘర్షణలపై ఆందోళనగా ఉన్నది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు దురదృష్టకరమని, రెండు దేశాలు శాంతికి అడుగులు వేయాలని రష్యా ఇప్పటికే కాంక్షించింది. అంతేకాదు, భారత్, చైనాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చొరవ తీసుకుంటున్నట్టు కొన్నివర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే 23న జరిగే ఈ త్రైపాక్షిక సమావేశాలపై అందరి దృష్టి మరలింది. సరిహద్దులో ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ఈ చర్చలు జరుగుతుండటం గమనార్హం.

Next Story

Most Viewed