రేపటి ఉదయం నుంచే ఆర్టీసీ సేవలు : కేసీఆర్

by  |
రేపటి ఉదయం నుంచే ఆర్టీసీ సేవలు : కేసీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఒక్క హైదరబాద్ నగరంలో సిటీ లోకల్ సర్వీసులు తప్ప రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు బస్సులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మొదలవుతాయని స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. బస్సుల్లో కొవిడ్ నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని అన్నారు. బస్సులను శానిటైజ్ చేయడంతో పాటు బస్సుల లోపల శానిటైజర్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు. సిబ్బంది, ప్రయాణికులు అందరూ శానిటైజ్ చేసుకోవడంతో పాటు మాస్కులు వాడాలని సీఎం కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు అనుమతించబోమని, తెలంగాణ బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లవని స్పష్టం చేశారు. సిటీలో ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు, కాంట్రాక్టు క్యారియర్లు అన్నిరకాల వాహనాలకు మంగళవారం నుంచి అనుమతిస్తున్నామని తెలిపారు. ట్యాక్సీలో డ్రైవర్ కాకుండా ముగ్గురు, ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మాత్రమే వెళ్లాలని లేదంటే పోలీసులు జరిమానా విధిస్తారని చెప్పారు. ప్రైవేటు వాహనాలకు సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయన్నారు. కర్ఫ్యూ అమలులోనే ఉంటుండడంతో రాత్రి 7 గంటల లోపలే బస్సులు నిర్ణీత గమ్యాలకు బయలుదేరుతాయని, టికెట్ ఉన్న వాళ్లకు మాత్రం ఒక గంట అదనంగా రోడ్డు మీద అనుమతిస్తారని సీఎం చెప్పారు..

ఉదయం మంత్రి సమీక్ష..

సోమవారం సాయంత్రం లాక్‌డౌన్ సడలింపులపై సీఎం కేసీఆర్ నివాసం ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం ఉండడంతో ఉదయం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బస్సులు నడపడంపై, బస్సుల్లో ఎలాంటి నిబంధనలు అమలు చేయాలనేదానిపై పలు నిర్ణయాలు తీసుకున్న మంత్రి సాయంత్రం వాటిని కేబినెట్‌కు నివేదించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించాల్సి ఉండడంతో ప్రతి బస్సును 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడపాలని నిర్ణయించారు. విధుల్లోకి వెళ్లే ముందు ఉద్యోగులందరికీ శరీర ఉష్ణోగ్రతలు తెలిపే థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు.

58 రోజులు బంద్.. మూడు లాక్‌డౌన్‌లు పూర్తి..

ప్రధాని మోడీ పిలుపు మేరకు మార్చి 22వ తేదీన పాటించిన జనతా కర్ఫ్యూ నుంచి సోమవారం దాకా 58 రోజుల పాటు మూడు దశల లాక్‌డౌన్ కాలంలో డిపోలకే పరిమితమైన బస్సులు మంగళవారం నుంచి మళ్లీ రోడ్డు మీద రయ్ మని దూసుకువెళ్లనున్నాయి. తాజాగా నాలుగో దశ లాక్‌డౌన్ సడలింపుల మార్గదర్శకాల్లో దేశంలో ప్రజారవాణాకు కేంద్రం అనుమతివ్వడంతో మంగళవారం నుంచి బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రోజుకు రూ.12 కోట్లు టికెట్లపై సంపాదించే ఆర్టీసీ లాక్‌డౌన్‌లో 58 రోజులు బస్సులు నడపకపోవడంతో సుమారు రూ.700 కోట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది.

రాజధానిలో బస్సులు శివార్ల నుంచే..

రాజధాని హైదరాబాద్ నగరం నుంచి కరీంనగర్ వైపు బస్సులు జేబీఎస్ నుంచి, నల్గొండ బస్సులు ఎల్బీ నగర్ అవతలి నుంచి, వరంగల్ బస్సులు ఉప్పల్ నుంచి, మహబూబ్‌నగర్ వైపు వెళ్లేబస్సులు ఆరాంఘర్ నుంచి బయలుదేరనున్నాయి. ఎంజీబీఎస్ మాత్రం మూసే ఉండనుంది. వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చిన వారు బస్సు ఆగినదగ్గర దిగి ఆటోలు, ట్యాక్సీల్లో ప్రయాణికులు రాజధానిలో తమ తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంటుందని వెల్లడించారు.



Next Story

Most Viewed