అంతర్ రాష్ట్ర బస్సులు షురూ..!

by  |
అంతర్ రాష్ట్ర బస్సులు షురూ..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : రెండు నెలల తర్వాత మళ్లీ ఆర్టీసీ సేవలు పూర్తి స్థాయిలో అందనున్నాయి.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత రెండు నెలలుగా ఆర్టీసీ బస్సులు అంతంత మాత్రంగానే నడుస్తుండగా.. తాజాగా అన్ని ఆర్టీసీ బస్సులు, అన్ని ప్రాంతాలకు తిరుగనున్నాయి.. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నేటి (సోమవారం) నుంచి ప్రారంభమవుతున్నాయి.. ఆంధ్రాకు సోమవారం సాయంత్రం నుంచి.. మహారాష్ట్రకు మంగళవారం నుంచి నడుపనున్నారు.. ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపు సమయంలోనే బస్సులు నడిపేలా షెడ్యూల్ తయారు చేశారు.. ఆర్టీసీ నష్టాల్లో ఉండగా.. తాజాగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూరు, ఆసిఫాబాద్, మంచిర్యాలలో ఆర్టీసీ బస్సు డిపోలున్నాయి. ఈ ఆరు ఆర్టీసీ డిపోల పరిధిలో మొత్తం 600లకుపైగా ఆర్టీసీ బస్సులుండగా.. ఇందులో 208అద్దె బస్సులున్నాయి. మొత్తం రీజియన్ పరిధిలో ఆర్టీసీ ఉద్యగోలు, సిబ్బంది 2600మంది వరకున్నారు. సాధారణంగా లాక్ డౌనుకు ముందు అన్ని బస్సులు రోజుకు 2.50లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగేవి. దీంతో సాధారణంగా గతంలో రోజుకు సగటున రూ.70-80లక్షల ఆదాయం సమకూరేది. తాజాగా కరోనా, లాక్డౌన్ కారణంగా పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. గత రెండు నెలలుగా మూడింటా ఒకవంతు బస్సులే రోడ్డెక్కగా.. లాక్డౌన్ సడలింపు ఉన్న సమయంలోనే అవి సమీప ప్రాంతాలకు వెళ్లేవి. దీంతో వచ్చే ఆదాయం డీజిల్, ఆర్టీసీ బస్సుల నిర్వహణకు కూడా సరిపోలేదు. ప్రతి నెలా రూ.10కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉండగా.. వచ్చే ఆదాయం నిర్వహణకే సరిపోలేదు.

కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టడంతొ.. ఆర్టీసీ పరిస్థితి అతలాకుతలమైంది. ఆర్థికంగా చాలా నష్టపోయిన ఆర్టీసీకి.. తాజాగా పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయటంతో మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడుపుతుండగా కేవలం తెలంగాణ వరకే నడిచాయి. సోమవారం (నేడు) నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ఆంధ్రాకు నడుపుతుండగా మంగళవారం నుంచి మహారాష్ట్రకు ఆర్టీసీ సర్వీసులు మొదలవుతున్నాయి. తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఉంది. మళ్లీ సాయంత్రం 6గంటల నుండి ఉదయం 6గంటల వరకు లాక్ డౌన్ ఉన్నందున సడలింపు సమయంలోనే అంతరాష్ట్ర బస్సులు నడుపనున్నారు. దీంతో ఆర్టీసీకి మళ్లీ ఆదాయం పెరిగి మంచి రోజులు వస్తాయనే ఆశ కలుగుతోంది.

రేపటి నుంచి అంతరాష్ట్ర సర్వీసులు:

నిర్మల్ నుండి ఉదయగిరి, పామురు, కందుకూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు బస్సులు సోమవారం సాయంత్రం నుండి నడపనున్నట్లు డిపోమేనేజర్ కే.ఆంజనేయులు తెలిపారు. అలాగే తిరుగు ప్రయాణం సాయంత్రం 6 గంటల లోపే ఆంధ్రా బార్డర్ దాటే ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అలాగే మంగళవారం నుండి మహారాష్ట్రకు.. నాందేడ్, కిన్వట్, ఇస్లాపూర్, హిమాయత్నగర్, అప్పారావు పేట్, షివినికి బస్సులు నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.

కే.ఆంజనేయుులు, నిర్మల్ డిపో మేనేజర్

Next Story

Most Viewed