జాడ లేని ఆర్టీసీ బస్సులు ఎక్కడంటే..?

by  |
జాడ లేని ఆర్టీసీ బస్సులు ఎక్కడంటే..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తి వేసింది. అయినా, ఆర్టీసీ బస్సులు పల్లె బాట పట్టడం లేదు. కేవలం ప్రధాన రహదారులకే పరిమితమయ్యాయి. లాక్ డౌన్ ఎత్తేసి నెల రోజులు కావొస్తున్న ఆర్టీసీ బస్సులు పల్లెల్లోకి రాకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీకి సైతం రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుంది. అయినా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ చూపడం లేదు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో నడిచే ప్రయివేటు, అద్దె బస్సులు సైతం నడవడం లేదు. చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 650 బస్సులు …

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్- ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్ మొత్తం ఎనిమిది బస్సు డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో 650 బస్సులు ఉన్నాయని, అందులో 350 ఆర్టీసీ బస్సులు కాగా 300 వరకు అద్దె బస్సులు ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. లాక్ డౌనకు ముందు 650 బస్సులు నడపగా రోజుకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.కోటి ఆదాయం సమకూరేది. ప్రస్తుతం బస్సులన్ని నడవని కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సగం ఆదాయం కూడా సమకూరడం లేదని, రోజుకు రూ .30 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

పల్లెలకు రాని ఆర్టీసీ బస్సు …..

కరోనా లాక్ డౌన్ కంటే ముందు ఆర్టీసీ బస్సులను ప్రధాన రహదారులతో పాటు పల్లెలకు సైతం నడిపే వారు. దీంతో ఆర్టీసీకి ఆదాయం బాగానే సమకూరేది. ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గకపోవడంతో బస్సులను ప్రధాన రూట్లకే పరిమితం చేశారు. పల్లెల్లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు పట్టణాలకు వెళ్ళి కూలీ పనులు చేసుకునే వారు మాత్రం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు రాక ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడం లేదు. ఫలితంగా పల్లెల్లోకి బస్సులను నడిపిన ఆదాయం నరుకూరడం లేదని, నష్టపోవాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆ చేతనే పల్లెలకు బస్సులు నడపడం లేదని, విద్యా సంస్థలు ప్రారంభం కాగానే పల్లెలకు బస్సులు పంపిస్తామని చెబుతున్నారు.

ఇంటికే పరిమితమైన అద్దె బస్సులు ..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందల వరకు అద్దె బస్సులు ఇంటికే పరిమితమయ్యాయి. కరోనా కారణంగా అన్ని రూట్లలో బస్సులు నడపకపోవడంతో అద్దె బస్సులు ఇంటికే పరిమితమైనట్టు ప్రాథమిక సమాచారం. దీంతో అద్దె బస్సులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న డ్రైవర్లు, అద్దె బస్సు యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అన్ని రూట్లలో బస్సులు నడిపించి, అద్దె బస్సులను తింపాలని పలువురు అద్దె బస్సు యజమానులు కోరుతున్నారు.


Next Story

Most Viewed