RTC స్థలం కబ్జా.. ‘దిశ’తో వెలుగులోకి సంచలన విషయాలు

by  |
RTC స్థలం కబ్జా.. ‘దిశ’తో వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఆర్టీసీ(సురక్షబస్టాండ్) స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని మణుగూరు సామాజిక కార్యకర్త(లాయర్)కర్నె రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ‘దిశ’ విలేకరితో మాట్లాడుతూ.. మండలంలోని ఆర్టీసీ సురక్షబస్టాండ్‌ను ప్రభుత్వం 2001లో ఏర్పాటు చేసిందన్నారు. ఈ బస్టాండ్‌కి గతంలో ఉన్న మణుగూరు తహసీల్దార్ RC no : B/1014/13 రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 203లో ఉన్న రెండు ఎకరాల26 గుంటల భూమి నుండి 16 గుంటల స్థలాన్ని ఆర్టీసీ బస్టాండుకు కేటాయించినట్టు తెలిపారు.

అయితే, 2011లో ఆ స్థలం వద్ద డిపో మేనేజర్ ధీరజ్ సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేశారన్నారు. ఈ క్రమంలో సైకిల్ స్టాండ్‌ను కొంత మంది వ్యక్తులు కబ్జా చేసి హోటల్‌గా మార్చారని ఆయన ఆరోపించారు. సైకిల్ స్టాండ్‌ను తీసివేసి హోటల్‌గా మార్చిన వ్యవహారంలో అప్పటి డిపో మేనేజర్ ప్రస్తుతం చోద్యం చూస్తూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. కబ్జాదారులు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడటం వల్లే ఆర్టీసీ స్థలం కబ్జాకు గురైందని ఆయన వివరించారు.

ప్రభుత్వం సురక్షబస్టాండ్ పున:నిర్మాణం కోసం 70 లక్షల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపిస్తున్నదని ఆయన తెలిపారు. సర్కర్ భూమికి కబ్జాకు గురవుతున్నా ఆర్టీసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ బస్టాండ్ కబ్జా విషయంపై హైదరాబాద్‌లో మానవ హక్కుల సంఘం చైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తొలగించి, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఆయన కోరారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు సహకరిస్తున్న స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.

epaper – 4:00 PM TS EDITION (22-11-21) చదవండి


Next Story

Most Viewed