ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి పువ్వాడ కీలక ప్రకటన

by  |
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి పువ్వాడ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : అమెజాన్ కంపెనీతో ఆర్టీసీ సంప్రదింపులు జరుపుతున్నదని, త్వరలోనే ఒప్పందం చేసుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఇప్పటి వ‌ర‌కు వ‌చ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లని తెలిపారు. గురువారం శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ముఠాగోపాల్, అబ్రహం, రఘునందర్ రావు, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, సీతక్క ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవ‌ల‌పై అడిగిన ప్రశ్నల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. హోం రాష్ట్రంలో పార్శిల్ పిక‌ప్, హోం డెలివ‌రీ స‌ర్వీసుల‌ను ప్రవేశ‌పెట్టాల‌నే ఆలోచన ఉన్నదన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి 195 కార్గో వాహ‌నాలున్నాయని భ‌విష్యత్‌లో మ‌రో 50 అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

177 బస్టాండ్లలో 790మంది ఏజెంట్లతో కార్గో సేవలు అందుతున్నాయని వివరించారు. బ‌ల్క్ వ‌స్తువుల ర‌వాణా కోసం ఓల్డ్ బ‌స్సుల‌ను వినియోగిస్తున్నామని, 10 మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగిన కార్గో బ‌స్సులు 150, 4 మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగిన కార్గో బ‌స్సులు 35, ఓపెన్ కార్గో బ‌స్సులు 10 ఉన్నాయని తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌లు, సూప‌ర్ డీల‌క్స్ బ‌స్సుల్లో కూడా కొరియ‌ర్స్, చిన్న పార్శిల్‌ను ర‌వాణా చేస్తున్నామ‌న్నారు. 30 మంది ప్రయాణికులు ఉంటే వారి వద్దకే బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే కాలంలో 75 కోట్ల నుంచి 100కోట్లు టార్గెట్ అన్నారు. ఎఫ్ సీఐ, సింగరేణి కి కార్గో సేవలను విస్తరించే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. కరోనాకు ముందు నిత్యం రూ.13కోట్లు వచ్చేవని, ఇప్పుడు 2కోట్లు కూడా రావడం లేదని చెప్పారు. టికెట్ల మీదనే ఆదాయం ఎక్కువగా వస్తుందని, 49 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి వేతనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని, ఏ బస్టాండ్ ను ఎత్తేయడం లేదని తెలిపారు. ములుగు బస్ డిపో, బస్సు స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు.



Next Story

Most Viewed