ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. వాటి కోసం రాజకీయాల్లోకి రాలేదు

by  |
ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. వాటి కోసం రాజకీయాల్లోకి రాలేదు
X

దిశ, అంబర్‌పేట్: ఫామ్ హౌస్‌లు కట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, విద్య, ఉద్యోగ, ఉపాధి కళలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని బీఎస్‌పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ రచయిత రఘు దేపాక రచించిన ‘తెలంగాణ ఉద్యమ, చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం’ పుస్తకావిష్కరణ సభ పోటీ పరీక్షల నిపుణులు అధ్యాపకుడు రియాజ్ అధ్యక్షతన బుధవారం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… కులమతాల అతీతంగా జ్ఞానం రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వృధా ఖర్చు చేస్తున్నారని, లక్షల కోట్లు విద్యకు ఖర్చు చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇజ్రాయిల్‌తో పోటీపడే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును మానవ వనరుల కోసం కాకుండా ప్రజలను దోచుకు తినే వారి కోసం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

ఇటీవల తాను తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఆయా ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి ఉన్నాయని పక్కనే 30 సంవత్సరాలు చాలామంది గుడిసెల నివాసం ఉంటున్నా.. వారికి కేటాయించలేదని విమర్శించారు. 75 సంవత్సరాల స్వాతంత్రంలో సంతకం వరకే చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు జ్ఞాన ప్రాజెక్టు అర్జెంటుగా రావాల్సి ఉందని అన్నారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చదువు అనేది జీవన విధానంలో భాగం కావాలని ఆకాంక్షించారు.

ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యోగం ఆర్థిక పరంగా కాకుండా ఆత్మ గౌరవంతో ఉండేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ రూపకల్పన చేయడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోకుండా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ శాఖలలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 65 వేలకే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు. తిండి పెట్టలేని రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎలా అవుతుందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసి అవసరం ఉందన్నారు. దేశంలో లేని ఆత్మహత్యలు తెలంగాణలో ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం బరిగీసి కోట్లాడుదామని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, నిరుద్యోగులతో కలిసి తెలంగాణ దద్దరిల్లే స్థాయిలో ఆందోళన చేపడతామని కోదండరాం హెచ్చరించారు.


Next Story

Most Viewed