కోకాపేట ఫాంహౌస్ తప్ప ప్రభుత్వానికి ప్రజలు కష్టాలు కనిపించవు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

by  |
కోకాపేట ఫాంహౌస్ తప్ప ప్రభుత్వానికి ప్రజలు కష్టాలు కనిపించవు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో గత నాలుగు రోజులుగా బీఎస్పీ పార్టీ చీఫ్ మాజీ ఐపీఎస్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లమల ప్రాంతంలో పల్లెబాట నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం బల్మూరు మండల పరిధిలోని పోలిశెట్టి పల్లి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల గోడును పట్టించుకునే నాథుడే లేడని.. అమాయక రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని ఆయన తెలిపారు.

ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వేలాది మంది రైతులకు రైతుబంధు అమలు కావడం లేదని, భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోలీసుల సహాయంతో నిర్వాసితులను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం, నక్కలగండి నిర్మాణంలో భూములు కోల్పోయిన గిరిజనులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసి తక్షణమే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దకాలంగా భూ పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం రైతులు ఎదురు చూస్తున్నా, నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

పోడు భూములకు పరిష్కారం చూపాలిని..

నల్లమల అటవీ ప్రాంతంలో దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న.. గిరిజనులు, గిరిజనేతరులకు ఆర్వోఎస్ఆర్ చట్టాన్ని అమలు చేసి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ఆదివాసీలు, ఎస్సీ, బిసి, మైనారిటీ వర్గాల పేదలు అటవీ భూములపై హక్కులు అడిగితే రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. రైతులపై అక్రమ కేసులు పెట్టడన్ని బిఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పే పంతుళ్లు లేకపోతే. విద్యాబోధన జరిగేదేట్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉప్పునుంతల మండలం తిరుమలాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల కు గాను కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడు బోధించడం విస్మయం కలిగించిందని తెలిపారు.

పాఠశాలలో విద్య వాలంటీర్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందని, రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తుచేశారు. నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్న తెరాస ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని ఆగ్రహించారు. వరి పండించే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని అన్నారు.

అప్పర్ ప్లాట్లో దయనీయ పరిస్థితి…

జిల్లాలోని అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు ఇచ్చేందుకు నిర్మించ తలపెట్టిన ఉమామహేశ్వర స్వామి, చెన్నకేశవస్వామి రిజర్వాయర్ కేవలం సర్వేలకు పరిమితమయ్యాయని అన్నారు. చాలా గ్రామాల్లో తాగు సాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజాసమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవని అమ్రాబాద్ మండల కేంద్రంలో గల 30 పడకల ఆసుపత్రి నిదర్శనమని గుర్తు చేశారు. అలాగే వటర్ల పల్లి గ్రామంలో తాగునీటి కోసం అవస్థలు పడుతూ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అచ్చంపేట్‌కి సాగునీరు అందించే చంద్రసాగర్ ప్రాజెక్టు హామీ నేటికీ నెరవేరలేదని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తవ్విన కాల్వలు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయన్నారు. చంద్ర సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది అన్నారు. నీరు రాకపోవడంతో పేదల భూములన్నీ బీడు భూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు నిత్యం భయంతో ఉన్నారని ఆర్ఎస్ తెలిపారు స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజు ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లినా, ప్రశ్నించిన, తిట్ల దండకం లేదా బెదిరించడం అవసరమైతే పోలీసు కేసులు బనాయించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

మందు విందులతో ఓట్లు దండుకునే పార్టీలకు బుద్ధి చెప్పాలి…

ప్రజల అవసరాలను విస్మరించి మందు విందులు, దళితుల అభివృద్ధి కోసం ఎన్నికల ముందు పథకాలు ప్రకటిస్తూ, పైసలు పంచుతూ, మందు, విందులతో మభ్యపెట్టి ఓట్లు దండుకునే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బహుజన వర్గాల ప్రజలు ఓటు విలువ తెలుసుకొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు. అచ్చంపేట లో 150, హాజీపూర్ లో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించినప్పటికీ, ఆ ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయని తెలియజేశారు.

రాష్ట్రంలో గత ఏడేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలపై పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా బీ ఎస్ పీ పార్టీ అధ్యక్షుడు పసుపులేటి రామకృష్ణ, పార్లమెంటు సభ్యుడు యోసేపు, నియోజకవర్గ ఇన్చార్జిలు నారి మల్ల వెంకటస్వామి, కొయ్యల శ్రీనివాసులు, ఆనంద్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed