రూ. 50 కోట్ల చీటర్.. మంత్రితో డీలింగ్.. ‘ఖాకీ’ భారీ ప్లాన్..!

by  |
రూ. 50 కోట్ల చీటర్.. మంత్రితో డీలింగ్..  ‘ఖాకీ’ భారీ ప్లాన్..!
X

దిశ, మక్తల్: షేర్ మార్కెట్‌‌లో పెట్టుబడి, అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ ఓ వ్యక్తి అమాయక జనాలకు కుచ్చిటోపి పెట్టిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 50 కోట్ల డిపాజిట్లు రాగానే షేక్ మహబూబ్ సుభాన్(చీటర్) రాత్రికి రాత్రే పరారీ అయ్యాడు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలో వెలుగుచూసిన ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

టీఆర్ఎస్ కీలక నేతతో డీలింగ్..

అధికార పార్టీకి చెందిన కీలక నేత మంత్రి, రాజకీయ నేతల సపోర్ట్‌తో కోర్టులో లొంగిపోయేందుకు సుభాన్ డీలింగ్ చేసుకున్నాడని చర్చలు నడుస్తున్నాయి. మంత్రి సహకారంతో పోలీసు ఉన్నతాధికారులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ విషయం మక్తల్ పోలీసులకు తెలియడంతో లొంగిపోయేలోపు అతడిని అరెస్ట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో సుభాన్ వ్యవహారంపై రాజకీయ పార్టీల నేతలు ఎప్పటికప్పుడూ అప్‌డేట్స్ తెలుసుకుంటున్నట్టు సమాచారం.

అవినీతి సామ్రాజ్యం నేతలకు తెలుసా..?

ఒకవేళ సుభాన్‌ పోలీసులకు చిక్కితే.. అతడికి ఇన్ని రోజులు సహకరించిన రాజకీయ నేతల కూపీ బయటకు వస్తోందన్న టెన్షన్ సదరు నేతల్లో ఉందని బాధితులు బల్ల గుద్ది చెబుతున్నారు. షేక్ మహబూబ్ సుభాన్ అవినీతి సామ్రాజ్యానికి రాజకీయ నేతల సహకారం ఉందని.. పోలీసులకు చిక్కితే అందరి జాతకాలు బయటపడుతాయన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.

అంతేకాకుండా.. మక్తల్ నియోజకవర్గం చుట్టు పక్కల ఉన్న వ్యవసాయ భూములను.. రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌ కోసం పలువురికి అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. ఇందులో ఏజెంట్లకు కూడా సుభాన్ చేతుల మీదుగా భారీగా కమీషన్ ఇచ్చినట్టు టాక్. అయితే, సుభాన్ సరెండర్ అయితే.. ఏజెంట్లు కూడా కోర్టుకెక్కాల్సి ఉండటం.. అడ్వాన్స్‌లు చెల్లించిన వారి నుంచి డబ్బులు వసూళ్లు చేయడమనేది ఏజెంట్లకు తలనొప్పిగా మారిందని.. అందుకే కేసు నుంచి ఎలా తప్పించుకోవాల్నో తెలియక సతమతం అవుతున్నారని సమాచారం.

ముగింపు అతి తర్వలోనే

భారీ మొత్తం డిపాజిట్లు చేసిన వారు ఓ వైపు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు కోట్లు కాజేసిన సుభాన్ మంత్రితో డీలింగ్ చేసుకోవడం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చేలా ఉన్నతాధికారులతో చర్చలు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు నియోజకవర్గంలో వెల్లువెత్తాయి. ఇక ఇదే కేసును చాలెంజ్‌గా తీసుకున్న మక్తల్‌ పోలీసులు లొంగిపోకముందే అరెస్ట్ చేసి ఖాకీ పవర్‌ చూపించి.. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాలని చూస్తున్నారని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే సుభాన్ వ్యవహారం ముగింపునకు వస్తోందని బలంగా నమ్ముతుండటం విశేషం.


Next Story

Most Viewed