కార్ల ఓనర్లకు ఊహించని షాక్.. రూ. 5 కోట్ల ఫైన్

by  |
కార్ల ఓనర్లకు ఊహించని షాక్.. రూ. 5 కోట్ల ఫైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రవాణా శాఖ అనుమతులు లేకుండా యథేచ్చగా నగర రోడ్లపై దర్జాగా ప్రయాణిస్తున్న లగ్జరీ కార్లపై ఆర్టీఓ అధికారులు రూ. 5 కోట్ల భారీ జరిమానాతో కొరడా ఝులిపించారు. ఆదివారం హైదరాబాద్‌లో లగ్జరీ కార్లపై ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖ డీటీసీ డా.కె.పాపారావు భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నును ఎగవేస్తూ దర్జాగా రోడ్డెక్కేస్తున్న హైఎండ్ లగ్జరీ కార్లపై గత ఆరు నెలలుగా నిఘా ఉంచామని పాపారావు తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారం డీటీసీ ఆధ్వర్యంలో 40 మంది అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లతో టీంలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో పన్నులు చెల్లించని 11 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. వీటి ద్వారా దాదాపు రూ.5 నుంచి రూ.8 కోట్ల ఆదాయం రాష్ట్రానికి ప్రత్యక్షంగా చేకూరే అవకాశం ఉందని, పరోక్షంగా రూ.100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పన్ను చెల్లించకుండా యథేచ్చగా తిరుగుతున్న లగ్జరీ కార్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలమని తనిఖీలు చేసి సీజ్ చేస్తామని, వీలైనంత త్వరగా పన్ను కట్టేయాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాల్లో మర్సెడెస్ బెంజ్, మాసెరటి, ఫెర్రారి, రోల్స్ రాయిస్, బీఎం డబ్ల్యూ, లాంబొర్గిని ఇతర కంపెనీల కార్లు ఉన్నాయి. రవాణా శాఖ చరిత్రలోనే ఇలాంటి దాడులు నిర్వహించడం మొదటిసారి అని చెప్పారు. ఈ తనిఖీతో రవాణాశాఖ అధికారులు ప్రశంస్తున్నారు. ఎంతటివారైనా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుంటే సీజ్ చేస్తామని ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. తనిఖీలో పాల్గొన్న ప్రతి అధికారిని పాపారావు అభినందించారు.



Next Story

Most Viewed