కరోనాతో మరణించిన కుటుంబాలకు.. ‘రూ. 4 లక్షల పరిహారం ఇవ్వలేం’

by  |
కరోనాతో మరణించిన కుటుంబాలకు.. ‘రూ. 4 లక్షల పరిహారం ఇవ్వలేం’
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి బలైనవారి కుటుంబ సభ్యులకు రూ. 4 లక్షల పరిహారం అందజేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిధులకూ పరిమితులు ఉన్నాయని వివరించింది. ఈ నిర్ణయంతో మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడింది. మహమ్మారిపై పోరును ప్రభావితం చేస్తుందని తెలిపింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఒక వేళ రూ. 4లక్షల పరిహారాన్ని అందజేస్తే రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిధులు ఖాళీ అవడం ఖాయమని వివరించింది. అంటే మొత్తం నిధులను కేవలం పరిహారానికే కేటాయించినట్టవుతుందని తెలిపింది.

ఎక్స్‌గ్రేషియా ద్వారానే ఆ కుటుంబాలను ఆదుకోవాలనుకోవడం సరైన నిర్ణయమని కాదని స్పష్టం చేసింది. సామాజిక భద్రత, ఆర్థికంగా పుంజుకోవడానికి దోహదపడటం కీలకంగా ఉండాలని వివరించింది. కొన్ని నెలలు లేదా ఏళ్లపాటు కొనసాగే ఇలాంటి మహమ్మారితో ప్రభావితమైనవారికి పరిహారం అందించడమనేది ఇప్పటి వరకు జరగలేదని పేర్కొంది. కరోనాపై పోరుకు, బాధితులకు పలుమార్గాల్లో ఆదుకోవడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు పెట్టాయని వివరించింది. ఆర్థికంగా అండగా నిలబడటానికి కేటాయింపులు చేశాయని పేర్కొంది.

పన్నుల రాబడులు తగ్గిపోవడం, మరోవైపు ఆరోగ్య రంగంపై పెద్దమొత్తంలో వెచ్చించి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోం వ్యవహారాల శాఖ వివరించింది. కాబట్టి, మితంగా ఉన్నటువంటి విపత్తు నిర్వహణ నిధులను ఎక్స్‌గ్రేషియాకు కేటాయిస్తే అవాంఛనీయ పరిణామాలను కొనితెచ్చుకున్నట్టవుతుందని తెలిపింది. వైద్యారోగ్యం రంగంలో పెట్టే ఖర్చును తగ్గింపు, కరోనా మహమ్మారిపై పోరునూ బలహీనపడటానికి ఇది కారణమయ్యే అవకాశముందని పేర్కొంది. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని నిర్ధారించడంతోపాటు ఇతర సహాయక చర్యలను నిర్ణయించడానికి నేషనల్ అథారిటీ సిఫారసులు చేయాల్సి ఉంటుందని, ఈ అథారిటీని పార్లమెంటులో చేసిన చట్టం ఏర్పాటుచేస్తుందని వివరించింది.

కరోనాను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా పరిగణించింది. అందుకు అనుగుణంగానే నిధులు కేటాయిస్తూ మహమ్మారిపై పోరు జరుపుతున్నది. ఇదే విపత్తు నిర్వహణ చట్టం కింద ఈ వైరస్‌తో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చే సెక్షన్ 12నూ అమలు చేయాలని ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. అడ్వకేట్లు గౌరవ్ కుమార్ బన్సాల్, రీపల్ కన్సాల్‌లు పిటిషన్ వేశారు. కరోనాతో కన్నుమూసిన వారి కుటుంబ సభ్యులకు రూ. 4 లక్షల పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాల్సిందిగా సుప్రీంకోర్టును వీరు ఈ పిటిషన్‌లో అభ్యర్థించారు.



Next Story

Most Viewed